గ్రేటర్లో విజృంభిస్తోన్న వైరస్
ABN , First Publish Date - 2020-05-23T10:55:13+05:30 IST
గ్రేటర్లో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం తాజాగా 42 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ముసారాంబాగ్ తీగలగూడకు చెందిన ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు.
మరో 42 మందికి పాజిటివ్
చాదర్ఘాట్/అఫ్జల్గంజ్/పహాడిషరీఫ్/అల్లాపూర్/రామంతాపూర్/బర్కత్పుర/ఎర్రగడ్డ/ముషీరాబాద్/మెహిపట్నం/ఆబిడ్స్/ఖైరతాబాద్/హైదరాబాద్ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్లో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం తాజాగా 42 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ముసారాంబాగ్ తీగలగూడకు చెందిన ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు.
వృద్ధుడి మృతి
ముసారాంబాగ్ తీగలగూడ అఫ్జల్నగర్కు చెందిన వృద్ధుడు గురువారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మృతిచెందాడు. అతడి కుటుంబంలో నలుగురికి, తర్వాత మరొకరికి ప్రైమరీ కాంటాక్టు ద్వారా కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వీరికి పాజిటివ్..
చంచల్గూడలో 55 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ రాగా ఆమె భర్త, కుమారుడు, కోడలిని క్వారంటైన్కు తరలించారు. ఓల్డ్మలక్పేట పాపయ్యబస్తీలో నివసిస్తున్న 56 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది.
జియాగూడ ఇందిరానగర్కు చెందిన ఓ వ్యక్తి(55)కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అతడి తమ్ముడు(50), భార్య(40), కొడుకు (20)కు పాజిటివ్ వచ్చింది.
హబ్సిగూడ వసంత విహార్ కాలనీలో నివసించే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఈయన పనిచేసే పోలీ్సస్టేషన్ సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాణా ప్రతా్పనగర్లో కరోనా సోకిన వ్యక్తి గత వారం చనిపోయాడు. అతడు నివసించే ప్రాంతంలో ఉండే ఓ మహిళ(50), ఆమె కొడుకు(25), మరో వృద్ధుడి(65)కి వైరస్ సోకడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
రామంతాపూర్ గణేశ్నగర్లో నివసించే వ్యక్తి(43)కి కరోనా పాజిటివ్గా తేలింది. అతడి కుటుంబంలోని 12 మందితోపాటు కారు డ్రైవర్ను ప్రకృతి చికిత్సాలయానికి తరలించారు.
భోలక్ఫూర్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వృద్ధుడికి కరోనా రాగా అతడి కుటుంబ సభ్యులు నలుగురిని ప్రకృతి చికిత్సాలయానికి తరలించారు.
అనుమానితులు..
నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 11 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరిని ఐసోలేషన్వార్డులో ఉంచారు. నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు.
ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో 11 కరోనా అనుమానిత కేసులకు చికిత్స అందిస్తున్నారు. ఐదుగురికి నెగెటివ్ రావడంతో డిశ్చార్జి చేశారు.
మెహిదీపట్నం సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో 26 మంది ఉన్నారు.
కింగ్కోఠి జిల్లా ఆస్పత్రిలోని ఓపీ విభాగానికి 112 మంది వచ్చారు. వీరిలో 32 మందిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. ప్రస్తుతం వందమంది కరోనా లక్షణాలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఖైరతాబాద్లో తగ్గిన కట్టడి ప్రాంతాలు
ఖైరతాబాద్ సర్కిల్లో ఏడు కట్టడి ప్రాంతాలు ఉండగా... ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, కుందన్బాగ్లలో కట్టడిని ఇటీవల తొలగించారు. తాజాగా నవీన్నగర్ గాయత్రీ అపార్ట్మెంట్, ఎస్ఆర్నగర్ పోలీ్సస్టేషన్ వెనకాల ఉన్న కట్టడి ప్రాంతాలను తొలగించారు.