కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , First Publish Date - 2021-01-25T05:31:33+05:30 IST
పేద ప్రజలందరికీ సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈగ సంజీవరెడ్డి అన్నారు.
మోపాల్, జనవరి 24: పేద ప్రజలందరికీ సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈగ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం బోర్గాం (పి) గ్రామ శివారులో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడం సంతోషకరమన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులాల వారికి సంక్షేమ పథకాలను కల్పించారని తెలిపారు. రెడ్డి కులాల్లో కూడా చాలామంది పేద వారు ఉన్నారని, కేసీఆర్ ఈ రిజర్వేషన్లు కల్పించడం వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బోర్గాం (పి) సొసైటీ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, నూడా డైరెక్టర్ అభిలాష్రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎర్రన్న, హన్మాండ్లు, రవి, ఆయా గ్రామాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.