‘ప్రసాద్‌’ పథకంలో అన్నవరం

ABN , First Publish Date - 2021-09-17T08:42:38+05:30 IST

అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా ‘ప్రసాద్‌’ పథకంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయాన్ని చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

‘ప్రసాద్‌’ పథకంలో అన్నవరం

అన్నవరం, సెప్టెంబరు 16: అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా ‘ప్రసాద్‌’ పథకంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయాన్ని చేరుస్తూ  కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఈ పథకం కింద కేంద్ర పర్యాటకశాఖ అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే శ్రీశైలం దేవస్థానానికి ఈ పథకంలో నిధులు మంజూరు చేయగా, ఆ మేరకు పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే సింహాచలం ఆలయానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. మూడేళ్ల కిందట అన్నవరం ఆలయంలో ఈ పథకం కింద సుమారు రూ.48.58 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపగా సాంకేతిక కారణాలతో నిధులు మంజూరుకాలేదు. దీంతో కాకినాడ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో ‘ప్రసాద్‌ స్కీమ్‌’లో చేర్చింది. దీంతో గతంలో ప్రతిపాదించిన పనులకు సంబంధించి నిధుల కేటాయింపులు జరగనున్నాయి. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2021-09-17T08:42:38+05:30 IST