అన్నవరం ఈవో దృష్టికి సమస్యల వెల్లువ
ABN , First Publish Date - 2022-06-28T06:24:26+05:30 IST
సుదూర ప్రాంతాల నుంచి సత్యదేవుడి సన్నిధికి విచ్చేసి వ్రతమాచరించుకునే భక్తులకు వ్రతంలో దేవస్థానం అందించే రవికల వస్త్రం పీలిక ముక్కలా ఉండడంతో పాటు సిల్క్వస్త్రం అందిస్తున్నారని మహిళా భక్తులు వీటిని వినియోగించుకునేందుకు వీలుగా మంచి వస్త్రం పెద్దది ఇవ్వాలని తాడేపల్లిగూడెనికి చెందిన గణేష్ అనే భక్తుడు ఈవోను కోరారు.
అన్నవరం, జూన్ 27: సుదూర ప్రాంతాల నుంచి సత్యదేవుడి సన్నిధికి విచ్చేసి వ్రతమాచరించుకునే భక్తులకు వ్రతంలో దేవస్థానం అందించే రవికల వస్త్రం పీలిక ముక్కలా ఉండడంతో పాటు సిల్క్వస్త్రం అందిస్తున్నారని మహిళా భక్తులు వీటిని వినియోగించుకునేందుకు వీలుగా మంచి వస్త్రం పెద్దది ఇవ్వాలని తాడేపల్లిగూడెనికి చెందిన గణేష్ అనే భక్తుడు ఈవోను కోరారు. ఈవో త్రినాథరావు సోమవారం డయర్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించి పలు సూచనలను, ఫిర్యాదులను అందించారు. కొందరు దళారులు దర్శనాలు చేయిస్తామని చెప్పి అనధికారికంగా డబ్బులు వసూలుచేసి ఆలయ ఖజానాకు నష్టం చేకూరుస్తున్నారని, అదే విధంగా కేశఖండన శాలలో నాయీబ్రాహ్మణులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని గణేష్ ఫిర్యాదు చేశారు. సత్రం గదుల నిర్వహణ సరిగాలేదని, రూంలలో బెడ్షీట్లు మార్చడంలేదని, దుప్పట్లు అడిగినా ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన ఈర్లు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కొండపై బస్సు దిగేందుకు, ఎక్కే సమయంలో బస్సు షెల్టర్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని షెల్టర్ ఏర్పాటు చేయాలని కాకినాడకు చెందిన సతీ్షకుమార్ సూచించారు. తొలిపావంచా వద్ద సిబ్బంది టిక్కెట్ లేకుండా ప్రసాదాలు నగదు తీసుకుని విక్రయిస్తున్నారని మరో భక్తుడు ఫిర్యాదు చేశారు. కాకినాడకు చెందిన సుబ్రహ్మణ్యం అనే భక్తుడు తాము గర్భగుడి దర్శనానికి వెళితే అర్చకుడు మహిళ అని చూడకండా భుజంపై చేయివేసి గట్టిగా తోసివేశాడని, ప్రశ్నిస్తే అక్కడ అటెండర్ దొంగభక్తులు అంటూ దుర్భాషలాడాడని ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.