రాష్ట్రంలో గవర్నర్‌కే భద్రత లేదు

ABN , First Publish Date - 2022-04-20T13:03:26+05:30 IST

రాష్ట్రంలో గవర్నర్‌కే తగిన భద్రత లేదని, ఇక సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. మైలాడుదురై వద్ద గవర్న

రాష్ట్రంలో గవర్నర్‌కే భద్రత లేదు

- స్టాలిన్‌ క్షమాపణలు చెప్పాలి 

- బీజేపీ నేత అన్నామలై డిమాండ్‌


చెన్నై: రాష్ట్రంలో గవర్నర్‌కే తగిన భద్రత లేదని, ఇక సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. మైలాడుదురై వద్ద గవర్నర్‌ కాన్వాయ్‌పై పథకం ప్రకారం దుండగులు రాళ్ళతో దాడి జరిపారని, నాయకుల ప్రోద్బలం వల్లే ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయని  చెప్పారు. ఇందుకు  ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకుంటే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. చెన్నైలో మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజూ హత్యలు, అత్యాచారాలు అధికమవుతున్నాయని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గవర్నర్‌ ప్రాణాలకు ముప్పువాటిల్లే ఇలాంటి సంఘటనను తీవ్రమైనదిగా పరిగణించాలన్నారు. గవర్నర్‌పై దాడిని ఖండిస్తూ బీజేపీ ఆందోళనలు జరిపి శాంతి భద్రతలకు భంగం కలిగించదన్నారు. గవర్నర్‌కు భద్రత విషయమై తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ  రాసినట్లు చెప్పారు. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని, సంఘటనపై డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులను సంజాయిషీ కోరాలనివిజ్ఞప్తి చేశారు. 


ఇళయరాజా బీజేపీ వ్యక్తి కాదు...

ఇళయరాజా బీజేపీకి చెందిన వ్యక్తి కాదని, తన సంగీతంతో ప్రజల మనసులను దోచుకున్న వ్యక్తి అని  అన్నామలై కొనియాడారు.  అంబేడ్కర్‌ని ప్రధాని మోదీతో పోల్చి ఓ పుస్తకానికి సంబంధించి ముందుమాటలో ఇళయరాజా ప్రశంసించడం తప్పుకాదన్నారు. బీజేపీకి  ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ఈ విషయంలో డీఎంకే ఐటీ విభాగం ఇళయరాజా కీర్తి ప్రతిష్టలను దిగజార్చే విధంగా విమర్శలు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వం కంటే ఆయను ‘భారతరత్న’తో సత్కరించడమే సముచితంగా ఉంంటుందని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-04-20T13:03:26+05:30 IST