అన్నాడీఎంకే-బీజేపీ మధ్య ‘నయినార్’ చిచ్చు
ABN , First Publish Date - 2022-01-27T14:38:32+05:30 IST
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ‘మగతనం’ లేదంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల
చెన్నై/అడయార్: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ‘మగతనం’ లేదంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అన్నాడీఎంకే నేతలు, ‘మగతనం’ అంటే మాటల్లో కాదనీ, చేతల్లో చూపించాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒంటరి గా పోటిచేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. అదేసమ యంలో నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా ఫిర్యాదు చేయాలని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి నిర్ణయించినట్లు సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేసి కేవలం 4 చోట్ల మాత్రమే గెలు పొందింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేసినప్పటికీ నామమాత్రపు సీట్లతో సరిపెట్టు కుంది. ఈ వ్యవహారం కూటమి నేతల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అదే సమయంలో అన్నాడీఎంకే నేత లను లక్ష్యం గా చేసుకుని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమ ర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై అన్నాడీ ఎంకే నేతలతో పాటు ఆ పార్టీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు..
అంతే కాకుండా శాసనసభ సమావేశాల్లో ఈరెండు పార్టీలు ఎడమొహం పెడమొహం గా ఉండడం లోలోన ఏదో జరుగుతోందన్న అనుమానాల ను రేపుతోంది. అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేస్తే బీజేపీ సభలో ఉండటం, బీజేపీ బయటకు వెళ్తే అన్నాడీ ఎంకే ఎమ్మెల్యేలు సభలో కూర్చొండిపోవడం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య సరైన సమన్వయం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వళ్లువర్ కోట్టం వద్ద తంజావూరు విద్యార్థిని లావణ్య మృతిపై సీబీ ఐ విచారణ కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఇందులో పాల్గొన్న నయినార్ నాగేంద్రన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుం దన్నారు. ‘శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకేలో మగతనంతో మాట్లాడే ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యేను కూడా చూడలేకపోతు న్నాం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగేంద్రన్ వ్యాఖ్యలు సహజంగానే అన్నాడీఎంకేలో కలకలం రేపాయి. తమ సాయంతో నాలుగు ఎమ్మెల్యే సీట్ల ను గెలుచుకున్న బీజేపీ నేత అలా మాట్లాడ్డమేంటని ప్రశ్నిస్తున్నాయి. నయినార్ నాగేంద్రన్పై చర్య తీసుకోవాలని అన్నాడీఎంకే నేతలు బీజే పీ సీనియర్ నేతలకు తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి నిర్ణయించినట్లు సమాచారం.
నయినార్ వ్యాఖ్యలతో సంబంధం లేదు : అన్నామలై
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యలతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. ఆయన పొరపాటున అలా మాట్లాడి ఉంటారని, దీనిపై ఎడప్పాడికి ఫోన్లో తాను వివరణ ఇవ్వడంతో పాటు పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అన్నాడీఎంకే - బీజేపీల బంధం సహజసిద్ధమైనదని, కూటమిలో ఎలాంటి పొరపచ్ఛాలకు తావులేకుండా చూసుకుంటామని ఆయన వివరించారు.