రామలింగేశ్వరుడికి అన్నాభిషేకం

ABN , First Publish Date - 2021-12-05T05:22:41+05:30 IST

రామలింగేశ్వరుడికి అన్నాభిషేకం

రామలింగేశ్వరుడికి అన్నాభిషేకం

  • కీసరగుట్టలో ముగిసిన కార్తీకమాసోత్సవం
  • ఘనంగా తైలాభిషేకం..
  • కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు


కీసర/మోమిన్‌పేట/తాండూరు: కీసరగుట్టలో కార్తీకమాసోత్సవం పూజలు ముగిశాయి. నెలరోజుల పాటు జరిగిన పూజల్లో భాగంగా కార్తీకమాసం అమావాస్యతో పాటు శనివారాన్ని పురస్కరించుకొని గర్భాలయంలోని మూలవిరాట్‌కు, స్వామివారికి తైలాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి శ్రీమహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆనంతరం భక్తుల సౌకర్యార్థం అభిషేకాలకు, ఆర్జిత సేవలకు అనుమతి ఇచ్చారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కాగా స్వామివారికి వరి బియ్యంతో చేసిన అన్నాన్ని అభిషేకం చేసి తర్వాత ప్రసాదాన్ని ఆలయ నిర్వాహకులు భక్తులకు వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ తటాకం నాగలింగం శర్మ, రాయిల శ్రావణ్‌ కూమార్‌ గుప్తా, బొడుసు రమేష్‌, సాయినాథ్‌ గౌడ్‌పాల్గొన్నారు. 

శనైశ్చరుడికి తైలాభిషేకాలు

కార్తీకమాసం చివరి రోజు, అమావాస్య కావడంతో  ఎన్కతలలోని శ్రీశనైశ్చర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం తెల్లవారుజాము 4గంటల నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, తైలాభిషేకాలు నిర్వహించారు. మండల ప్రజలే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఇదిలా ఉండగా రాళ్ల గుడుపల్లి గ్రామంలో వెలసిన శ్రీరామలింగేశ్వర దేవాలయంలోనూ భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.    

సంగమేశ్వరాలయంలో.. 

యాలాల మండలం కోకట్‌ సంగమేశ్వరాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణం గాంధీనగర్‌ వార్డు కౌన్సిలర్‌ సంగీతాఠాగూర్‌ ఆధ్వర్యంలో ఆలయంలో సంగమేశ్వరుడికి పూజలు, అభిషేకం నిర్వహించి దీపారాధన చేశారు. అనంతరం నదిలో దీపాలు వదిలారు. వనభోజనాలు చేశారు.



Updated Date - 2021-12-05T05:22:41+05:30 IST