కపిలేశ్వరస్వామి ఆలయంలో అన్నాభిషేకం
ABN , First Publish Date - 2021-10-21T07:13:55+05:30 IST
తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అన్నాభిషేకం నిర్వహించారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా జరిపారు.
తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 20: తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అన్నాభిషేకం నిర్వహించారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా జరిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం కపిలేశ్వరస్వామి మహాలింగానికి (మూలమూర్తికి) అన్నాభిషేకం, అన్నలింగ అలంకరణ చేపట్టారు. అంతకుముందు శుద్ధోదకంతో స్వామికి అభిషేకం చేశారు. అనంతరం 150కిలోల బియ్యంతో వండిన అన్నంతో కపిలేశ్వర లింగానికి అభిషేకం కావించారు. భూమితలం నుంచి పానవట్టం, లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పివేశారు. దానిపైన అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు. సాయంత్రం భక్తులకు అన్నలింగ దర్శనం, అన్నలింగ ఉద్వాసన చేశారు. స్వామికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ భూపతి, ఆలయ ఇన్స్పెక్టర్ రెడ్డిశేఖర్, అర్చకులు పాల్గొన్నారు.