అంకమ్మ ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2022-09-27T04:24:07+05:30 IST

మండలంలోని బండేపల్లిలో వెలసిన అంకమ్మ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

అంకమ్మ ఆలయంలో చోరీ
తాళం తీసిఉన్న హుండీ

నగలు, నగదు అపహరణ

 మనుబోలు, సెప్టెంబరు 26: మండలంలోని బండేపల్లిలో వెలసిన అంకమ్మ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం వేకువన పూజారి ఆలయానికి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండడంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల కథనం మేరకు.. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగి 40 రోజులు పూర్తికావడంతో ఆదివారం అంకమ్మకు ప్రత్యేకంగా నగలు అలంకరించి పూజలు చేసి పొంగళ్లు పొంగించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని వారే కాకుండా ఇతర గ్రామాల నుంచి వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ క్రమంలో రాత్రి చోరులు గర్భగుడి తాళాలు పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న రెండు బంగారు మంగళ సూత్రాలు, నాలుగు కాసులు, రెండు గుండ్లు అపహరించుకెళ్లారు. దీంతో పాటు మండపంలో ఉన్న స్టీల్‌ హుండీని పగలగొట్టి నగదు దోచుకుని హుండీని ఆలయానికిసమీపంలో ఉన్న జామాయిల్‌ చెట్లలో పడేసి వెళ్లారు. ఇదే గ్రామంలో ఆరు నెలల క్రితం గంగమ్మ ఆలయంలో ఇదే తరహాలో చోరీ జరిగింది. దేవాలయాల్లో చోరీలు జరగడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-09-27T04:24:07+05:30 IST