ముగిసిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-05-19T05:10:30+05:30 IST
బీచుపల్లి క్షేత్రంలో జరిగిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి.
- కనుల పండువగా స్వామి ఉత్సవాలు
- దాసంగాలు పెట్టిన భక్తులు
ఇటిక్యాల,మే 18: బీచుపల్లి క్షేత్రంలో జరిగిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా స్వామి వారి ఉత్సవాలు జరగలేదు. ఈ యేడాది ఉత్సవాలకు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఈనెల 14నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వారి రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు రావడంతో ఆలయ ఆవరణం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. ఐదు రోజుల పాటు వేద పండితులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామి వారికి నిత్యపూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఒకరోజు ముందుగానే భక్తులు బీచుపల్లి క్షేత్రానికి చేరుకొని ఆలయ ఆవరణంలో నిద్రించి మొక్కుబడులలో భాగంగా దాసంగాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు ఆలయ అర్చకులు స్వామి వారికి ఆకు పూజ, నైవేద్యాలు అనంతరం పల్లకిలో ఆలయం నుంచి మేళవాయిద్యాలతో కృష్ణానది తీరం వరకు తీసుకెళ్లి పుష్కరఘాట్ దగ్గర అవభృత స్నానం చేయించారు. నెల రోజుల పాటు ప్రతీ శనివారం స్వామి వారికి భక్తులు దాసంగాలు పెట్టి మొక్కులు తీర్చుకోవడం అనవాయితీ. ఉత్సవాలలో ఈవో రామన్గౌడ్, అర్చకులు ప్రహ్లాదచారి, మారుతిఆచారి, సందీపాచారి, ఆలయ సిబ్బంది, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.