తల్లిని విశాఖలో గెలిపించుకోలేని జగన్ ఏ రంగు చీరకట్టుకోవాలి?: అనిత

ABN , First Publish Date - 2022-04-28T21:41:09+05:30 IST

అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకురాలేని సీఎం జగన్...

తల్లిని విశాఖలో గెలిపించుకోలేని జగన్ ఏ రంగు చీరకట్టుకోవాలి?: అనిత

అమరావతి: అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకురాలేని సీఎం జగన్, వైసీపీ నేతలు మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి రోజాను ఉద్దేశించి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక అనూష, రమ్య, తేజస్విని, వరలక్ష్మి, నాగమ్మ, ఈరోజు తెనాలి.. ఇలా వివాహితలు బలవ్వడానికి ముఖ్యమంత్రి జగన్ కారణం కాదా? అని ప్రశ్నించారు. లోకేశ్ గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటున్నారని, ముఖ్యమంత్రిలా ఇల్లు దాటి బయటకురాకుండా, పోలీస్ పహారా లేకుండా బయటకురాలేని దుస్థితిలో లేరని అన్నారు. లోకేశ్ ఓడిపోయారంటున్న రోజా ఓడిపోలేదా? అని ప్రశ్నించారు. తల్లిని విశాఖపట్నంలో గెలిపించుకోలేని జగన్ ఏరంగు చీరకట్టుకోవాలో రోజా చెప్పాలన్నారు.


మహిళా సాధికారతంటే కచ్చాబాదం డాన్స్ లేస్తూ, జబర్దస్త్ షో కోసం నవ్వు రాకపోయినా.. పడిపడి నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకోవడం కాదమ్మా రోజా అంటూ అనిత ఎద్దేవా చేశారు. మేం ఊరికో ఉన్మాది అంటే ఉలిక్కిపడుతున్నారెందుకని ప్రశ్నించారు. టీడీపీ పుస్తకం విడుదలచేశాకే వైసీపీ నేతల్లో చలనం వచ్చిందన్నారు. ఊరికో ఉన్మాది ఉన్నాడని తాము, తమపార్టీ నిరూపిస్తుందని.. అందుకు వైసీపీ నేతలు సిద్ధమా? అని సవాల్ చేశారు. గుంటూరులో బాలికను నిర్బంధించి రోజుల తరబడి అత్యాచారం చేసింది వైసీపీకి చెందిన ఉన్మాదులుకాదా? అని ప్రశ్నించారు. మంత్రిపదవిలో ఉండి.. రోజా ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. మీలాంటి వారందరికీ ఎన్నిచీరలు కావాలో చెబుతే పంపిస్తామన్నారు. జగన్ రెడ్డి, భారతి గురించి మాట్లాడితే ఊరుకోవా.. ఆడబిడ్డలను కాపాడలేని అసమర్థుడి గురించి మళ్లీ మళ్లీ మాట్లాడతామని, సాటి ఆడబిడ్డగా మహిళలపై జరిగే దారుణాలపై స్పందించలేని సీఎం సతీమణి గురించి మాట్లాడతామని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-28T21:41:09+05:30 IST