నివేదికను బహిర్గతం చేయండి.. సీజేఐకి ఘన్వత్ లేఖ

ABN , First Publish Date - 2021-11-23T21:19:36+05:30 IST

సాగుచట్టాలపై సుప్రీం కోర్టు కమిటీ ప్యానల్ సమర్పించిన నివేదకను బహిర్గతం చేయాలని కమిటీ సభ్యుడు ..

నివేదికను బహిర్గతం చేయండి.. సీజేఐకి ఘన్వత్ లేఖ

న్యూఢిల్లీ: సాగుచట్టాలపై సుప్రీం కోర్టు కమిటీ ప్యానల్ సమర్పించిన నివేదకను బహిర్గతం చేయాలని కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణకు ఆయన లేఖ రాశారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సదరు చట్టాలకు సంబంధించి కమిటీ నివేదికకు ఇక చెల్లుబాటు ఉండదని, అయితే రైతు అంశాలపై కమిటీ చేసిన సూచనలు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడతాయని ఆ లేఖలో ఘన్వత్ పేర్కొన్నారు.


''కొందరు లీడర్లు తప్పుదారి పట్టించడం వల్ల రైతుల్లో కొన్ని ఆపోహలు ఏర్పడ్డాయన్నది నా అభిప్రాయం. ఆ అపోహలను తేలికపరచడంలో కమిటీ నివేదిక కీలక పాత్ర పోషించింది'' అని ఘన్వత్ పేర్కొన్నారు. చట్టాల్లో మార్పులు చేసైనా వాటిని వ్యవసాయ రంగంలో సంస్కరణలను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అనంతరం మీడియాతో ఘన్వత్ మాట్లాడుతూ, రాబోయే రెండు మూడు నెలల్లో తాను దేశవ్యాప్తంగా పర్యటించి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు మద్దతుగా లక్ష మందికి పైగా రైతులను సమీకరిస్తానని అన్నారు. రైతులు డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రస్తుతానికైతే సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌పీకి చట్టం తీసుకువస్తే ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-23T21:19:36+05:30 IST