మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామాకు బీజేపీ పట్టు
ABN , First Publish Date - 2020-04-10T19:55:52+05:30 IST
మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామాకు బీజేపీ పట్టు
ముంబై : లాక్డౌన్ కాదని డీహెచ్ఎఫ్ఎల్ యజమానులకు బయటికి వెళ్లడానికి అనుమతినిచ్చిన ఉదంతం మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేత కిరీట్ సోమయా శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అనుమతినిచ్చిన ఐపీఎస్ అధికారిని సెలవు పంపడం ఈ కేసును తప్పుదోవ పట్టించడమే అవుతుందని ఆయన మండిపడ్డారు.
అసలు డీహెచ్ఎఫ్ఎల్ యజమానులైన వాద్వాన్ సోదరులకు వీఐపీ సౌకర్యాలు కల్పించాలని ఎవరో అనుమతినిచ్చారో ముందు తేల్చాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అమితాబ్ గుప్తాను సెలవుపై పంపడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని, దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని కిరీట్ డిమాండ్ చేశారు. లాక్డౌన్ అమలులో ఉన్నా సరే, సీనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ గుప్తా డీహెచ్ఎఫ్ఎల్ యజమానులు కపిల్, ధీరజ్ వాధ్వాన్లు ప్రయాణించడానికి అనుమతినివ్వడంతో తక్షణమే సెలవుపై వెళ్లిపోవాలని సీనియర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ గుప్తాను ఆదేశించినట్లు హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించిన విషయం తెలిసిందే.