వైద్యం అందక ఆందోళనలో ప్రజలు

ABN , First Publish Date - 2020-08-04T11:23:18+05:30 IST

కొద్దిపాటి, జలుబు, జ్వరం వచ్చినా కరోనా పరీక్షలు తప్పనిసరి అంటూ వైద్యులు తేల్చిచెప్పడంతో, పరీక్షలు చేయించుకుందామన్నా క్యూలో నిల్చొని

వైద్యం అందక ఆందోళనలో ప్రజలు

ఏ రోగమైనా కరోనా పరీక్ష తప్పనిసరి అని తిప్పి పంపుతున్న  ప్రభుత్వ వైద్యులు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జహీరాబాద్‌ ప్రజలు


జహీరాబాద్‌, ఆగస్ట్టు3: కొద్దిపాటి, జలుబు, జ్వరం వచ్చినా కరోనా పరీక్షలు తప్పనిసరి అంటూ వైద్యులు తేల్చిచెప్పడంతో, పరీక్షలు చేయించుకుందామన్నా క్యూలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల కాలం కావడంతో ప్రతి దానికి కరోనా పరీక్ష తప్పనిసరి అంటూ జహీరాబాద్‌లోని ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తిప్పి పంపుతున్నారన్నారు. దీంతో మిగితా రోగాలకు సంబంధించి వైద్యం చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరీక్షల అనంతరమే చికిత్స చేస్తామని చెప్పడంతో వైద్యం అందక పలువురు మృతి చెందిన సందర్భాలు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జహీరాబాద్‌ పట్టణంలో పెద్ద ప్రభుత్వాస్పత్రి ఉన్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగా వైద్యం అందక చివరకు ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి వ్యాఽధిని నయం చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జహీరాబాద్‌ పట్టణంలో ప్రతి రోజూ పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవడంతో భయాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలో కరోనా పరీక్షల కేంద్రాల సంఖ్యను పెంచితే సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జహీరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - 2020-08-04T11:23:18+05:30 IST