కన్న కూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. సహకరించిన సోదరుడు.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-04-14T17:59:44+05:30 IST

ప్రస్తుతం దేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది అని మురిసిపోతున్నాం

కన్న కూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. సహకరించిన సోదరుడు.. కారణమేంటో తెలిస్తే షాక్!

ప్రస్తుతం దేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది అని మురిసిపోతున్నాం. మూఢ నమ్మకాలను వదిలించుకుంటూ ఆధునికతను సంతరించుకుంటూ ముందుకు వెళ్తోందని గర్వపడుతున్నాం. అయితే ఇప్పటికీ దేశంలో చాలా చోట్ల కులాంతర వివాహాలను తీవ్రంగానే పరిగణిస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్న యువతీ యువకులను కుటుంబ సభ్యులే ఘోరంగా చంపేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. 


ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన నీలమ్ అనే యువతి తన పక్కింట్లో నివసించే మోహిత్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ తరచుగా కలుసుకుని మాట్లాడుకునేవారు. మోహిత్‌ది వేరే కులం కావడంతో అతనితో మాట్లాడవద్దని నీలమ్‌ను కుటుంబ సభ్యులు పలుసార్లు హెచ్చరించారు. అయినా ఆమె తల్లిదండ్రుల మాట వినలేదు. మోహిత్‌ను వివాహం చేసుకోవాలనుకుంది. అందుకోసం కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించింది. అయినా వారు వినలేదు. దీంతో నీలమ్ మంగళవారం రాత్రి తన ఇంటి నుంచి మోహిత్ ఇంటికి వెళ్లిపోయింది.


ఇంటికి తిరిగి వచ్చేయమని నీలమ్‌ను తండ్రి సుభాష్, సోదరుడు రాజేష్ అడిగారు. మోహిత్ కుటుంబ సభ్యులు నీలమ్‌కు నచ్చ చెప్పి బుధవారం ఉదయం ఆమెను ఇంటికి పంపేశారు. బుధవారం మధ్యాహ్నం నీలమ్‌ను ఆమె తండ్రి, సోదరుడు గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నీలమ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. సుభాష్, రాజేష్‌లను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-04-14T17:59:44+05:30 IST