అంగన్వాడీ కార్యకర్తల తీరుపై ఆగ్రహం
ABN , First Publish Date - 2021-10-27T04:14:34+05:30 IST
అంగన్వాడీ కార్యకర్తల తీరుపై ఆగ్రహం
దోమ: మండలం లోని బొంపల్లి అంగన్వాడీ సెంటర్లో కార్యకర్తలు ఇష్టానుసారంగా వ్యవహరించారని పలువురు గర్భిణులు, బాలింతలు మంగళవారం తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ఖాళీగా ఉండటంతో శివారెడ్డిపల్లి, బాసుపల్లి, బొంపల్లితండా, గొడుగోనిపల్లి గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలను ఇన్చార్జిలుగా నియమించారు. అయితే వారు గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందించే సరుకులు పంపిణీ చేయడంలో తీవ్రఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు వస్తేనే సరుకులు ఇస్తామని చెప్తున్నారని, సంబంధీకులు వెళ్తే ఇవ్వడంలేదని వాపోయారు. గుర్తింపుకోసం తమతో సెల్ఫీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అంగన్వాడీ కార్యకర్తలు పనితీరు మార్చుకొని తమ సంబంధీకులు వస్తే సరుకులు ఇవ్వాలని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.