అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి పోరాటం.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
ABN , First Publish Date - 2021-01-25T04:53:37+05:30 IST
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేవరకు పోరాటం చేస్తామని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు.
వచ్చే నెలలో వరంగల్ సదస్సులో కార్యాచరణ
ఖమ్మంటౌన్, జనవరి 24: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేవరకు పోరాటం చేస్తామని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలపై. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. వచ్చేనెల 7న వరంగల్లో జరిగే సమావేశంలో ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ఉద్యమానికి పెద్దన్నలా అండగా ఉంటానని తెలిపారు. అంగన్వాడీలతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటూ కనీస గుర్తింపు ఇవ్వటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే శాఖలు చేయాల్సిన పనులను అంగన్వాడీలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న్నారని, వారికి న్యాయం చేసేందుకు అండగా నిలబడతానని అన్నారు. అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా చాకిరీ చేయించుకుంటున్నా. ఉద్యోగభద్రత, గౌరవం లేదని అంగన్వాడీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.