ఉద్యోగులూ మీరు కాస్త తగ్గాలి

ABN , First Publish Date - 2022-01-07T08:29:42+05:30 IST

వేతన సవరణ (పీఆర్‌సీ)పై ఉద్యోగులు తమ అంచనాలను కాస్త తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచించారు. తెలంగాణతో పోల్చుకోవద్దని.. ప్రాక్టికల్‌గా

ఉద్యోగులూ మీరు కాస్త తగ్గాలి

  • ప్రాక్టికల్‌గా ఆలోచించాలి
  • తెలంగాణతో పోల్చుకోవద్దు
  • భేటీలో ముఖ్యమంత్రి జగన్‌ సూచన
  • 2-3 రోజుల్లో పీఆర్సీ అని వెల్లడి
  • రెండేళ్లుగా ఆదాయం తగ్గింది
  • 2018-19లో జీతాలు, పెన్షన్లకు
  • రూ.52,513 కోట్ల ఖర్చు
  • 2020-21కి 67,340 కోట్లకు చేరింది
  • ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడే ఎక్కువ
  • ఆదాయం ఎలా ఉన్నా..
  • మేం రాగానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం
  • మంచి చేయాలనే మా తపన: సీఎం
  • నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మీ అంచనాలు కాస్త తగ్గాలి.. 
  • అధికారులు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది. 


ఆర్గ్యుమెంట్‌కు బలం చేకూరుతుందని.. తెలంగాణతో పోలిక చేస్తే బాగుంటుందని అనిపించవచ్చు. నిజంగా ఆ రాష్ట్రంలో వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? వారి తలసరి ఆదాయం ఎంత? వీటన్నింటినీ ఒకసారి పరిశీలన చేయాలని కోరుతున్నా.


సీఎం జగన్‌


అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వేతన సవరణ (పీఆర్‌సీ)పై ఉద్యోగులు తమ అంచనాలను కాస్త తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచించారు. తెలంగాణతో పోల్చుకోవద్దని.. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని హితవు పలికారు. రెండు, మూడ్రోజుల్లో పీఆర్‌సీపై ప్రకటన చేస్తామన్నారు. గురువారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఏటా ప్రభుత్వంపై రూ.7,136 కోట్ల భారం పడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆయనకు నివేదిక ఇచ్చింది. జీతాలు, పెన్షన్ల వ్యయం తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, హరియాణ రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే అధికమని పేర్కొంది. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘అధికారులు చెప్పినదానికి, మీరు చెప్పినదానికి వ్యత్యాసం ఉంది. అందుకే మీతో మాట్లాడుతున్నాను. నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మీ అంచనాలు కాస్త తగ్గాలి.. అధికారులు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది.


వాళ్లకు కూడా చె బుతున్నాను. పరిష్కరిద్దాం. మీకు మనసా వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నాను’ అని ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. ప్రతి ఏటా ఆదాయాలు పెరుగుతుంటాయని.. రాష్ట్రానికి కనీసం 15 శాతం పెరిగేదని.. కానీ గత రెండేళ్లుగా ఆదాయం పెరిగిందా అని ఆలోచన చేయాలని కోరారు. పెరగకపోగా.. తగ్గాయని చెప్పారు. రాష్ట్ర సొంత ఆదాయం (స్టేట్‌ ఓన్‌ రెవెన్యూ్‌స-ఎ్‌సవోఆర్‌) 2018-19లో రూ. 62,503 కోట్లు ఉండేదని.. 2020-21లో రూ.60,688 కోట్లకి తగ్గిందని.. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామని తెలిపారు. 2018-19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు కాగా.. 2020-2021 నాటికి రూ.67,340 కోట్లకు చేరుకుందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆదాయం ఎలా ఉన్నా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చామని.. రూ.18 వేల కోట్ల వరకు చెల్లించామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకూ మినిమం టైం స్కేల్‌ సహా ఇతర ప్రయోజనాలు అందించామన్నారు. 


తెలంగాణలో జీతాల ఖర్చు 17 వేల కోట్లు..

‘తెలంగాణతో పలుమార్లు పోలిక వస్తోంది. అక్కడ వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ. 2,37,632 కాగా, ఏపీలో అది రూ.1,70,215 మాత్రమే. అక్కడ జీతాల మీద వాళ్లు ఖర్చు చేసింది రూ.17 వేల కోట్లు, పెన్షన్ల కోసం రూ.5,603 కోట్లు. మొత్తం కలిపి (కాగ్‌ రిపోర్టు ప్రకారం) రూ.22,608 కోట్లు. ఇది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు తొలి ఏడు నెలల కాలానికి అయిన ఖర్చు. అదే మన రాష్ట్రంలో అదే కాలానికి జీతాలకు రూ.24,681.47 కోట్లు, పెన్షన్లకు రూ.11,324 కోట్లు.. మొత్తం దాదాపు రూ.36 వేల కోట్లు చెల్లించాం’ అని సీఎం తెలిపారు. ఈ కాలంలో గుజరాత్‌లో వేతనాలు, పెన్షన్ల కోసం ఇచ్చింది కేవలం రూ.16,053 కోట్లని.. బిహార్‌లో రూ.25,567.5 కోట్లు చెల్లించారని.. ఇలాంటి వాస్తవ పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. ‘తెలంగాణలో హైదరాబాద్‌ను కోల్పోయాం. మనకు ఆదాయాలు తగ్గుతున్నాయి. తెలంగాణలో పెరుగుతున్నాయి. ఇవన్నీ వాస్తవాలు’ అని పేర్కొన్నారు.


ఎంత మంచి చేయగలిగితే అంత..

ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నట్లు సీఎం చెప్పారు. మనం ఉన్న పరిస్థితులపై ఆలోచన చేయాలని.. అదే సమయంలో వారు చెప్పినవన్నీ పరిగణనలోకి తీసుకుంటానని తెలిపారు. ‘ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తాను. ఇది నా హామీ. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. 2, 3 రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తాం. మీతో సమావేశానికి ముందు పలు దఫాలుగా అధికారులతో మాట్లాడాను. కమిటీ చెప్పినట్లుగా 14.29 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై పడే భారం రూ.7,137 కోట్లు. ఇది వాస్తవం. ఇచ్చిన డీఏలు కూడా ఉద్యోగులకు అందాలి. ఫిట్‌మెంట్‌ ఇచ్చే సమయానికి డీఏలు కూడా క్లియర్‌ కావాలి. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నాను. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తాం. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తాం’ అని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-07T08:29:42+05:30 IST