AP: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-03-10T17:28:32+05:30 IST

బీమా మిత్రల సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది.

AP: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

అమరావతి: బీమా మిత్రల సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ బీమా మిత్రలు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. ర్యాలీగా వెళ్తున్న బీమా మిత్రలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్ట్‌ను బీమా మిత్రలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీమా మిత్రలు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోసం చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పి తర్వాత తొలగించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీమా మిత్రలను నిర్దాక్షిణ్యంగా తొలగించారన్నారు. ఉద్యోగాలు పోవడంతో తామంతా కుటుంబాలతో సహా  రోడ్డున పడ్డామని తెలిపారు. మేము చేసే పనులను సచివాలయ సిబ్బందికి అప్పగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని బీమామిత్రలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-10T17:28:32+05:30 IST