సీఎం జగన్పై హరిరామజోగయ్య విసుర్లు
ABN , First Publish Date - 2022-04-15T17:49:38+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ హోంమంత్రి, కాపుసంక్షేమ సేన వ్యవస్ధాపక అధ్యక్షుడు చెగోండి హరిరామజోగయ్య విమర్శలు గుప్పించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ హోంమంత్రి, కాపుసంక్షేమ సేన వ్యవస్ధాపక అధ్యక్షుడు చెగోండి హరిరామజోగయ్య విమర్శలు గుప్పించారు. రాత్రి, పగలు అనకుండా పల్లెలు, పట్టణాలు అని లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు అనధికారికంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దౌర్భాగ్య స్ధితిని ప్రజలు చూడలేదని తెలిపారు. నిరవధిక విద్యుత్ సరఫరా చేయలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అనుభవ రాహిత్యమే అని ఆయన వ్యాఖ్యానించారు. నవరత్నాలు అనేక మందికి అందిస్తున్నామని సీబీఐ దత్తపుత్రుడు జగన్ చెపుతున్నారని యెద్దేవా చేశారు. ఈ పథకాల ద్వారా 10 శాతం మంది ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు. తమ జేబులు నింపుకోవడమే ధ్యేయంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేసే ప్రాజెక్టులు ప్రైవేటు వ్యక్తులకు తక్కవ ధరకు అమ్మడం, పోరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. గోరుచుట్టుపై రోకలి పోటులా విద్యుత్ కోతలకు తోడుగా విద్యుత్ చార్జీల పెంపు ఈ ప్రభుత్వం చేసిందని ఆగ్రహించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దించి జనసేన గ్యారేజ్ దెబ్బ రుచి చూపించాలని హరిరామజోగయ్య వ్యాఖ్యలు చేశారు.