ఏపీలో పంచాయతీ నిధులు మాయమవడంలో మర్మం ఏంటి?
ABN , First Publish Date - 2021-11-26T01:14:27+05:30 IST
గ్రామ పంచాయతీల నిధులు ప్రభుత్వ ఖాతాల్లో జమయ్యాయి. పంచాయతీల తీర్మానాలు లేకుండా.. కనీసం సర్పంచ్లకు సమాచారం ఇవ్వకుండానే...
అమరావతి/హైదరాబాద్: గ్రామ పంచాయతీల నిధులు ప్రభుత్వ ఖాతాల్లో జమయ్యాయి. పంచాయతీల తీర్మానాలు లేకుండా.. కనీసం సర్పంచ్లకు సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు ఖాళీ చేసేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు ఒక్కో చిన్న పంచాయతీకి రూ.1.50 లక్షలు తక్కువగా కాకుండా జమ చేసింది. జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు మంజూరు చేస్తుంది. ఇటీవల పంచాయతీలకు ఈ నిధులు విడుదల కాగా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా వీటిని వెనక్కి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నిధులను జిల్లాల అధికారులు ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ అకౌంట్కు మళ్లించారు. ఈ నిధులను నవరత్నాలు, ఇతరత్రా పథకాలకు వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు పంచాయతీల నిధులను ప్రభుత్వం మళ్లించడాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచ్లు తప్పుబడుతున్నారు. 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు మళ్లిస్తే అభివృద్ధి ఎలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీల్లో తిరగలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఇప్పటికైనా ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు తిరిగి జమ చేయాలని రాష్ట్ర సర్పంచ్ల ఫోరం డిమాండ్ చేస్తోంది.
ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘పంచాయతీ నిధులు మాయవడంలో మర్మం ఏంటి?. జగన్ ప్రభుత్వం పూర్తిగా కరవులో కూరుకుపోయిందా?. గ్రామాల నిధులు తీసుకుంటే స్థానిక ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?. పల్లె టూళ్లలో ప్రజల కనీస అవసరాలు ఎలా తీరతాయి?. రోడ్డెక్కిన సర్పంచ్లకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది?. ప్రజలను బాది, పంచాయతీలను బాది ప్రభుత్వం చేసేదేంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.