గల్ఫ్‌లో మరణించిన ప్రవాసీయుడి కుటుంబానికి అండగా నిలిచిన ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులు!

ABN , First Publish Date - 2022-07-04T01:12:59+05:30 IST

సౌదీ అరేబియాలో ఎన్నారై మృతిపై ఆంధ్రజ్యోతి పత్రిక కథనానికి స్పందించిన తెలుగు ప్రవాసీయులు మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు.

గల్ఫ్‌లో మరణించిన ప్రవాసీయుడి కుటుంబానికి అండగా నిలిచిన ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులు!
మృతుడి కుటుంబానికి చెక్కును అందిస్తున్న శ్యాం నాయక్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో ఎన్నారై మృతిపై ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనానికి స్పందించిన తెలుగు ప్రవాసీయులు మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు. లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.  నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన కదిలె చందు.. సౌదీలో ఓ మారుమూల ప్రాంతంలోగల వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తూ మృతిచెందారు. అతడి మృతదేహాన్ని ఇండియాకు తరలించడంలో ఎదురవుతున్న చిక్కులు, అతడి కుటుంబ దీనిస్థితి గురించి, ఆంధ్రజ్యోతి ఓ సవివరమైన కథనాన్ని ప్రచురించింది. పోస్ట్‌మార్టంలో జాప్యం కారణంగా తొమ్మిది నెలలుగా మృతదేహం సౌదీలోనే ఉండిపోవడాన్ని పాఠకుల దృష్టికి తెచ్చింది. మృతుడి కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోభను కళ్లకుకట్టినట్టు వివరించింది. ఈ కథనంపై తెలుగు ప్రవాసీయుల సంఘం తెలుగు అసోసియేషన్ జెద్ధా(తాజ్) స్పందించింది. సంఘం బాధ్యులు యూదుమూర్తి, ఆప్పారావు నేతృత్వంలో ‘తాజ్’.. మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల సాయం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్యాం నాయక్ ద్వారా తాజ్ సంఘం సభ్యులు బాధితులకు డబ్బును అందజేశారు. 

Updated Date - 2022-07-04T01:12:59+05:30 IST