AP News: మహిళా పోలీసు అధికారి తీరుపై జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2022-10-04T17:56:04+05:30 IST

శ్రీకాళహస్తిలో ఓ మహిళపై మహిళా పోలీసు అధికారి వ్యవహరించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్...

AP News: మహిళా పోలీసు అధికారి తీరుపై జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌

చిత్తూరు జిల్లా (Chittoor Dist.): శ్రీకాళహస్తిలో ఓ మహిళపై మహిళా పోలీసు అధికారి వ్యవహరించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్ (National  Women Commission) సీరియస్ (Serious) అయింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఫిర్యాదుకు స్పందించింది. మహిళా పోలీసు అధికారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని డీజీపీ (DGP)ని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఘటనపై నిర్ధేశిత కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేయాలని పేర్కొంది. బాధిత మహిళకు వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించింది.

 

పూర్తి వివరాలు...

శ్రీకాళహస్తిలో నాలుగు రోజుల క్రితం సీఐ అంజు యాదవ్‌ ఓ మహిళ వద్దకు వెళ్లి ఆమె భర్త ఆచూకీ చెప్పాలంటూ ఆమెపై దురుసుగా ప్రవర్తించి, కాలుతో తన్నటం, చీర, జుట్టుపట్టుకుని లాగుతూ పోలీస్ వాహనంలో ఎక్కించడం.. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ ఘటనపై ప్రత్యేకంగా విజువల్స్‌తోపాటు కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన వంగలపూడి అనిత.. ఓ మహిళపట్ల పోలీస్ అధికారి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. ఆ లేఖపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలీస్ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. అలాగే బాధిత మహిళకు సరైన వైద్య సదుపాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు అనితకు కూడా సమాచారం పంపించారు.


శ్రీకాళహస్తి ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్ ప్రవర్తించిన తీరు జుగుప్సకరంగా ఉందని  రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి అన్నారు. రక్షకభటులే నేడు భక్షించే పరిస్థితికి చేరారని ఆమె మండిపడ్డారు. ఒక మహిళ అన్న ఇంగితజ్ఞానం లేకుండా చిరు వ్యాపారి పట్ల అనుచితంగా వ్యహరించారని ధ్వజమెత్తారు. బాధితురాలి చీర లాగేసి వివస్త్రను చేసి జీపులో తోసి అంజు యాదవ్ దారుణంగా ప్రవర్తించిందని గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక మహిళను బూటు కాలితో తన్నిన చరిత్ర సీఐ మంజు యాదవ్‌దని వ్యాఖ్యానించారు. గతంలోనే అంజు యాదవ్‌ గురించి జిల్లా ఎస్పీకి వివరించానని.. అయినా తీరు మారలేదని గజ్జల లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఐ అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి మహిళా సీఐ డిపార్ట్‌మెంట్‌లో ఉంటే పోలీస్ వ్యవస్థపై నమ్మకం కోల్పోవాల్సి వస్తుందని గజ్జల లక్ష్మి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-04T17:56:04+05:30 IST