దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-11-03T15:16:59+05:30 IST

ఏపీ సర్కారు దిగొచ్చింది..

దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

టీచర్‌, విద్యార్థుల నిష్పత్తిలో మార్పు 

1:20గా మారుస్తూ సర్కారు నిర్ణయం 

ఏకోపాధ్యాయ పాఠశాలలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో కదలిక 


అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిపై సర్కారు దిగొచ్చింది. విలీనంతో విద్యా వ్యవస్థ ధ్వంసమవుతుందని, ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయగా మిగిలిపోతాయంటూ ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనాలతోపాటు ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని 1:20గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలల విలీనం కొనసాగాలని, అయితే 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు కాకుండా 20 మందికి ఒకరు చొప్పున ఉండాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్‌ చినవీరభద్రుడు మెమో జారీ చేశారు.


ఇప్పటివరకు ఈ నిష్పత్తి 1:30గా ఉండేది. దీనివల్ల ప్రాథమిక పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయగా మారతాయనే ఆందోళన వ్యక్తమైంది. ప్రాథమిక పాఠశాలల్లో 3, 4 5 తరగతుల్ని సమీపంలోని ఉన్నత పాఠశాలలో కలిపేయాలని నిర్ణయించారు. దీంతో 1, 2 తరగతులకు కలిపి ఒకే ఉపాధ్యాయుడు మిగిలే పరిస్థితి ఏర్పడింది. విలీనం జరిగే 6వేల పాఠశాలల్లో సుమారు 5వేలు ఏకోపాధ్యాయ అయిపోతాయి. దీంతో బోధనలో నాణ్యత దెబ్బతింటుందని ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. 

Updated Date - 2021-11-03T15:16:59+05:30 IST