Andhra Doctor: భారత ప్రభుత్వానికి ఆంధ్రా డాక్టర్ విజ్ఞప్తి ఇదీ..
ABN , First Publish Date - 2022-10-06T03:36:45+05:30 IST
ఉక్రెయిన్(Ukrain)లో చిరుత పిల్లల పెంపకంతో ‘జాగ్వార్ కుమార్’గా గుర్తింపుపొందిన ఆంధ్రా డాక్టర్ (andhra doctor) గిడికుమార్ పాటిల్ గుర్తున్నారా?.
లండన్: ఉక్రెయిన్(Ukrain)లో చిరుత పిల్లల పెంపకంతో ‘జాగ్వార్ కుమార్’గా గుర్తింపుపొందిన ఆంధ్రా డాక్టర్ (andhra doctor) గిడికుమార్ పాటిల్ గుర్తున్నారా?. వైద్యుడిగా పనిచేసిన ఆయన ఉక్రెయిన్-రష్యా యుద్ధపరిస్థితుల కారణంగా ప్రస్తుతం పోలాండ్లోని వార్సాలో ఆశ్రయం పొందుతున్నారు. సురక్షిత ప్రాంతంలోనే తలదాచుకుంటున్నా.. ఆయన ప్రాణమంతా ఉక్రెయిన్లో ఉన్న తన పెంపుడు చిరుతలపైనే ఉంది. ఉక్రెయిన్ను వీడే సమయంలో ఆర్థిక పరిస్థితి బాలేక చిరుతపిల్లలను లుహాన్స్క్లో ఓ స్థానిక రైతుకు అప్పగించి వెళ్లారు. చిరుత పులులను బాగోగులను ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారు. అయితే రష్యా యుద్ధం కారణంగా అక్కడ ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోవడంతో ఆయనకు ఫోన్ చేయడం సాధ్యపడడం లేదు. అయినప్పటికీ ఎలాగైనా తన చిరుతలను రక్షించుకోవాలని భావిస్తున్న ఆయన అవకాశమున్న అన్ని మార్గాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే భారత ప్రభుత్వం సాయం కోరారు.
చిరుతలను తరలించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తనకు అవగాహన లేదని గిడికుమార్ పాటిల్ చెబుతున్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలు, యూరప్ లేదా భారత్ వంటి దేశాలు ముందుకొచ్చి చిరుతలను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత ప్రభుత్వం ముందుకొస్తే పులులను రక్షించే మార్గాలను చెబుతానని వేడుకుంటున్నారు. కాగా ఉక్రెయిన్లో వైద్యుడిగా స్థిరపడ్డ గిడికుమార్ పాటిల్కు పెంపుడు జంతువులంటే ఇష్టం. అంతరించిపోయే దశలో ఉన్న రెండు అరుదైన చిరుతలు ‘యాశా’ అనే జాగ్వార్, ‘సబ్రినా’ అనే ఫాంథర్లను గత రెండేళ్లుగా పెంచుకుంటున్న విషయం తెలిసిందే.