అందని బిల్లులు.. ఆగిన పనులు

ABN , First Publish Date - 2022-07-02T06:29:34+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత గూడు కల్పించడానికి చేపట్టిన భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

అందని బిల్లులు.. ఆగిన పనులు
శ్లాబ్‌స్థాయిలో నిలిచిన సచివాలయ భవనం

పెదకోటలో అసంపూర్తిగా భవన నిర్మాణాలు

ఏడాది నుంచి ఇదే పరిస్థితి

పట్టించుకోని అధికారులు, పాలకులు

అనంతగిరి, జూలై 1: ప్రభుత్వ కార్యాలయాలకు సొంత గూడు కల్పించడానికి చేపట్టిన భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులేత్తేశారు. పనులు ఆగిపోయి ఏడాది దాటుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. అధికారులను అడిగితే.. బిల్లుల చెల్లింపు తమ చేతుల్లో లేదని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలంలోని పెదకోట పంచాయతీలో సుమారు రెండేళ్ల క్రితం గ్రామ సచివాలయం, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, రైతు భరోసా కేంద్రానికి భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. సచివాలయ భవనానికి రూ.40 లక్షలు, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనానికి రూ.22 లక్షలు, ఆర్‌బీకేకి రూ.28 లక్షలు మంజూరు చేశారు. టెండర్లు ఖరారైన కాంట్రాక్టర్లు పనులు చేపట్టి, శరవేగంగా సాగించారు. కొంతమేర పనులు అయిన తరువాత బిల్లులు పెట్టారు. తొలుత కొంత ఆలస్యంగా బిల్లులు మంజూరైనప్పటికీ ఆ తరువాత పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఏడాది నుంచి భవన నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు అంతస్థుల్లో నిర్మిస్తున్న సచివాలయ భవనానికి శ్లాబ్‌లు వేసి వదిలేశారు. మొత్తం   రూ.15 లక్షల విలువ చేసే పనులు చేయగా, కాంట్రాక్టర్‌కు రూ.9.46 లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. ఆర్‌బీకే భవనం శ్లాబ్‌ స్థాయిలో ఆగిపోయింది. మొత్తం రూ.10.6 లక్షల విలువైన పనులు చేయగా, రూ.6.36 లక్షల బిల్లు మాత్రమే క్లియర్‌ అయ్యింది. హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ భవనం పరిస్థితి కూడా ఇదే విధంగా వుంది. ఇక్కడ కూడా రూ.10.6 లక్షల విలువ చేసే పనులు పూర్తవ్వగా, కాంట్రాక్టర్‌కు రూ.7.3 లక్షల బిల్లు మాత్రమే అందింది. పనులు ఆగిపోయి ఏడాది దాటినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. అప్పులు చేసి పనులు చేపట్టామని, అధికారులేమో పనులు పూర్తిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని, బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పడంలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

Updated Date - 2022-07-02T06:29:34+05:30 IST