కోవిడ్ బాధితులకు ఎమ్మెల్యే బాలకృష్ణ సాయం
ABN , First Publish Date - 2021-05-13T17:31:42+05:30 IST
కరోనా కట్టడికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన వంతు సహాయం అందించారు.
అనంతపురం: కరోనా కట్టడికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన వంతు సహాయం అందించారు. దాదాపు రూ.20 లక్షల విలువ చేసే కొవిడ్19 మందులను తన కార్యాలయానికి పంపించారు. చౌడేశ్వరి కాలనీలోని తన నివాసం వద్ద స్థానిక టీడీపీ నాయకులు కరోనా కిట్లను ప్రజలకు పంపిణీ చేశారు. కోవిడ్ లక్షణాలు ఉన్న బాధితులు ఎవరైనా సరే ఆధార్ కార్డుతో ఎమ్మెల్యే నివాసానికి వస్తే కరోనా మందులను అందజేస్తామని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ రమేష్ విమర్శించారు. మనసున్న ప్రజానాయకుడు తమ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూ ప్రజల ఇబ్బందులను అధ్యయనం చేసి రూ.20లక్షలు విలువ చేసే మందులను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. అవసరమైతే మరిన్ని కొవిడ్ మందులు ఇవ్వడానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ కౌన్సిలర్ రమేష్ తెలిపారు.