YCP కార్యకర్తల అరాచకం... మాజీ Army jawanపై దాడి

ABN , First Publish Date - 2022-07-05T17:58:13+05:30 IST

అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

YCP కార్యకర్తల అరాచకం... మాజీ Army jawanపై దాడి

అనంతపురం (Anantapuram): వైసీపీ (YCP) కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆలయానికి (Temple) దారి కోసం అడిగినంత స్థలం ఇవ్వలేదని రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ (Rtd. Army jawan)పై దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం, శింగనమల నియోజకవర్గంలో కలకలం రేపింది. నిదనవాడకు చెందిన నాగేంద్ర ఆర్మీలో ఉద్యోగం చేస్తూ ఇటీవలే పదవి విరమణ చేశారు. తన గ్రామంలో 30 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. అయితే ఇంటి పక్కనే ఉన్న ఆలయానికి రెండడుగుల స్థలం ఇవ్వాలని వైసీపీ శ్రేణులు నాగేంద్రను అడిగారు. దేవుడి కోసం రెండడుగుల స్థలమేంటి.. నాలుగు అడుగుల స్థలం ఇస్తానని చెప్పారు. కానీ వైసీపీ నాయకులు వారం రోజుల క్రితం ఉన్నట్టుండి పది అడుగుల స్థలం ఇవ్వాలని నాగేంద్రను కోరారు. దీనికి నాగేంద్ర ఒప్పుకోక పోవడంతో పదిమంది వైసీపీ కార్యకర్తలు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలతో రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో నాగేంద్ర అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు.


దాడి ఘటనపై నాగేంద్ర భార్య ఉషారాణి శింగనమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోగా వైసీపీ నాయకులతో రాజీకి రావాలని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలని ఉషారాణి వాపోయింది. తన భర్తపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆమె జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసింది. వైసీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరింది.

Updated Date - 2022-07-05T17:58:13+05:30 IST