ఆనందయ్య మందుపై ‘రగడ’

ABN , First Publish Date - 2021-12-28T00:57:06+05:30 IST

ఆనందయ్య మందు పంపిణీపై కృష్ణపట్నంలో రగడ జరిగుతోంది. ఒమైక్రాన్‌ వేరియంట్‌కి తాను ఆయుర్వేద మందు తయారు చేశానని

ఆనందయ్య మందుపై ‘రగడ’

నెల్లూరు: ఆనందయ్య మందు పంపిణీపై కృష్ణపట్నంలో రగడ జరిగుతోంది. ఒమైక్రాన్‌ వేరియంట్‌కి తాను ఆయుర్వేద మందు తయారు చేశానని, పంపిణీకి సిద్ధంగా ఉందని ఇటీవల  ఆనందయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇతర ప్రాంతాల నుంచి భారీగా వాహనాల్లో కృష్ణపట్నం వచ్చారు. కొవిడ్‌ బాధితులు, ఇతర వ్యాధిగ్రస్థులు నేరుగా గ్రామంలోకి వస్తుండటంపై కృష్ణపట్నం గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆనందయ్య ఇంటి వద్దకు వెళ్లి మందు పంపిణీని అడ్డుకున్నారు. కొవిడ్‌ బాధితులు నేరుగా గ్రామంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. గతంలోనూ మందు పంపిణీ సమయంలో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి  వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణపట్నం సర్పంచు మోచర్ల వజ్రమ్మ, ఉపసర్పంచు రాగాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామస్థులు గ్రామంలో మందు పంపిణీ చేసేందుకు వీల్లేందని అభ్యంతరం చెప్పారు. అయితే, మందు పంపిణీకి తనకు అనుమతులు ఉన్నాయని ఆనందయ్య చెప్పడంతో అందుకు సంబంధించిన కాగితాలు చూపాలని గ్రామస్థులు పట్టుబట్టారు.


ఈ విషయంపై ఆనందయ్య, ఆయన అనుచర వర్గానికి, గ్రామస్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మందు పంపిణీ పేరుతో ఇతర రాష్ట్రాల కొవిడ్‌ బాధితులు తమ గ్రామంలోకి వస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణపట్నం ఎస్‌ఐ అంజిరెడ్డి గ్రామంలోకి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఏమైనా అనుమతులు ఉంటే చూపాలని ఎస్‌ఐ ఆనందయ్యను కోరగా, అవన్నీ మీ దగ్గరే ఉన్నాయని సమాధానమిచ్చారు. తమకు ఎలాంటి అనుమతి ఉత్తర్వులు రాలేదని, మీ వద్ద ఉంటే చూపించమని ఎస్‌ఐ కోరారు. గ్రామస్థుల అభ్యంతరం మేరకు మందు పంపిణీని ఆపివేయాలని కోరారు. 

Updated Date - 2021-12-28T00:57:06+05:30 IST