మేము సైతం..

ABN , First Publish Date - 2020-04-05T09:54:43+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరులో మేము సైతం..అంటున్నారు దేశ ప్రముఖ చెస్‌ ఆటగాళ్లు. దిగ్గజం ఆనంద్‌తోపాటు తెలుగు తేజాలు కొనేరు హంపి, పి.హరికృష్ణ,...

మేము సైతం..

కరోనాపై పోరుకు చెస్‌ స్టార్ల నిధుల సేకరణ

ఎగ్జిబిషన్‌ టోర్నీకి ఆనంద్‌, హంపి, హరికృష్ణ 


చెన్నై: కరోనా మహమ్మారిపై పోరులో మేము సైతం..అంటున్నారు దేశ ప్రముఖ చెస్‌ ఆటగాళ్లు. దిగ్గజం ఆనంద్‌తోపాటు తెలుగు తేజాలు కొనేరు హంపి, పి.హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, విదిత్‌ గుజరాతి, అధిబన్‌ వీరిలో ఉన్నారు. కొవిడ్‌-19పై యుద్ధానికి నిధుల సేకరణలో భాగంగా ఈనెల 11న ఈ ఆరుగురు ఆటగాళ్లు ఎగ్జిబిషన్‌ చెస్‌ టోర్నీలో పాల్గొననున్నారు. చెస్‌.కామ్‌ పోర్టల్‌ ద్వారా వీరు ప్రపంచంలోని చెస్‌ ప్లేయర్లతో గేమ్‌లు ఆడనున్నారు. 20 బోర్డులపై మ్యాచ్‌లు జరుగుతాయి.


చెస్‌.కామ్‌/టీవీ ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ టోర్నీ ద్వారా వసూలైన మొత్తాన్ని పీఎం కేర్స్‌ నిధికి అందజేస్తారు. ‘కోవిడ్‌-19పై పోరుకు విరాళాల సేకరణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతు పలకండి’ అని ప్రస్తుతం జర్మనీలో ఉన్న గ్రాండ్‌మాస్టర్‌ ఆనంద్‌ కోరాడు. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు 2000లోపు ఫిడే రేటింగ్‌ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్లేయర్లు విరాళాలు ఇవ్వాలి. 150 అమెరికా డాలర్లు విరాళంగా ఇస్తే ఆనంద్‌తో గేమ్‌ ఆడవచ్చు. ఇక.. 25 అమెరికా డాలర్ల రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లిస్తే ఆరుగురు భారత స్టార్‌ ఆటగాళ్లలో ఒకరితో పోటీపడవచ్చు. వీరిలో ఒకరు ఆనంద్‌ కూడా ఉండే అవకాశముంది. 

Updated Date - 2020-04-05T09:54:43+05:30 IST