మూడు కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందో జగనే చెప్పాలి: ఆనంద్ బాబు

ABN , First Publish Date - 2022-03-18T21:15:35+05:30 IST

రైతు పక్షపాతిగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం.. ప్రతి అంశంలో రైతులను ధగా చేస్తోందని నక్కా ఆనందబాబు విమర్శించారు.

మూడు కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందో జగనే చెప్పాలి: ఆనంద్ బాబు

గుంటూరు: రైతు పక్షపాతిగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం.. ప్రతి అంశంలో రైతులను ధగా చేస్తోందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మూడు కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైయ్యిందో సీఎం జగనే చెప్పాలన్నారు. రైతుల దగ్గర ఉన్న వరి ధాన్యం ఎవరు కొంటారో తెలీయక దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉందన్నారు.


గత సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంత వరకు డబ్బులు జమ కాలేదని ఆనంద్ బాబు అన్నారు. రైతులు ఇంత ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజా ప్రతినిధులకు చీమ కుట్టినట్లు కూడా లేదని, వైసీపీ నాయకులు దళారుల అవతారమెత్తి మిల్లర్లతో కలిసి రైతులను  దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారని, రాష్ట్రంలో రైతాంగానికి కరెంట్ కష్టాలు మొదలయ్యాయన్నారు. మీటర్లు బిగించే విషయంలో వరల్డ్ బ్యాంక్‌కు రైతులను తాకట్టు పెట్టటానికే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. మీటర్ల విషయంలో రైతాంగం ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రైతుల తరపున టీడీపీ ఆధ్వర్యంలో పోరాటానికి తాము సిద్ధమని ఆనంద్ బాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-18T21:15:35+05:30 IST