AP News: ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2022-07-31T00:40:37+05:30 IST

అనకాపల్లి జిల్లా (Anakapalli District) అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపాన ఏటిమొగ (పొగిరి) వద్ద సముద్ర తీరంలో శుక్రవారం గల్లంతైన ఐదుగురు విద్యార్థుల

AP News: ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా (Anakapalli District) అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపాన ఏటిమొగ (పొగిరి) వద్ద సముద్ర తీరంలో శుక్రవారం గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. నలుగురి మృతదేహాలు పూడిమడక శివారు జాలారిపాలెం-పొగిరి మధ్య, మరొకరిది ప్రమాద స్థలానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో గల తంతడి తీరంలో లభించింది. అనకాపల్లి డైట్‌ కళాశాలకు చెందిన 12 ఇంజనీరింగ్‌ విద్యార్థులు శుక్రవారం సముద్ర స్నానాలకు వెళ్లగా ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఇందులో ఒకరి మృతదేహం శుక్రవారం లభ్యం కాగా, చీకటి పడేంత వరకూ గజ ఈతగాళ్లు, మెరైన్‌ పోలీసులు గాలించినా మిగిలిన వారి ఆచూకీ తెలియలేదు. దీంతో శనివారం ఉదయం నేవీ హెలీకాప్టర్‌ (Navy helicopter)ను రంగంలోకి దించారు. పొగిరి కొండకు చేరువలో విశాఖపట్నం పద్మనాభ నగర్‌కు చెందిన కంపర జగదీష్‌, మునగపాక మండలం చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్‌ మృతదేహాలను శనివారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో గుర్తించారు. 


మృతదేహాలను తాళ్ల సహాయంతో హెలికాప్టర్‌లోకి ఎక్కించి తీరానికి చేర్చారు. మరోపక్క కోస్టల్‌ పోలీస్‌ సిబ్బంది పూడిమడక మత్స్యకారుల సహకారంతో పడవలపై గాలింపు చేపట్టారు. సుమారు పదిన్నర, పదకొండు గంటల ప్రాంతంలో పొగిరి-జాలారిపాలెం మధ్య తీరంలో ఎలమంచిలి మండలం ఎర్రవరానికి చెందిన పూడి రామచంద్రశేఖర్‌, గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరి మృతదేహాలను పడవపై పొగిరి ప్రాంతానికి సముద్రమార్గంలో తీసుకువచ్చారు. ఇక మిగిలిన రోలుగుంటకు చెందిన సుర్ల జస్వంత్‌కుమార్‌ మృతదేహం కోసం పూడిమడక నుంచి పొగిరి వరకు ఒకపక్క నేవీ హెలీకాప్టర్‌, మరో పక్క పడవలపై మెరైన్‌ సిబ్బంది తీవ్రంగా గాలించారు. కానీ ఎక్కడా ఆచూకీ తెలియలేదు. చివరకు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో గల తంతడి పంచాయతీ శివారు వాడపాలెం తీరంలో జస్వంత్‌కుమార్‌ మృతదేహాన్ని అక్కడ మత్స్యకారులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-07-31T00:40:37+05:30 IST