ముహూర్తం దాటినా సిద్ధంకాని ధ్వజమేఖలం
ABN , First Publish Date - 2021-07-25T04:24:02+05:30 IST
ఆగమ సంప్రదాయాలకు విరుద్ధంగా అలంపూరు క్షేత్రంలో జీవధ్వజ కలశం, మేఖలాలను తొలగించిన అధికా రులు పాపభీతితో చేసిన దిద్దుబాటు చర్యలు ఫలించలేక పోయాయి.
- నేటికి వాయిదా వేసిన అధికారి
అలంపూరు, జూలై 24 : ఆగమ సంప్రదాయాలకు విరుద్ధంగా అలంపూరు క్షేత్రంలో జీవధ్వజ కలశం, మేఖలాలను తొలగించిన అధికా రులు పాపభీతితో చేసిన దిద్దుబాటు చర్యలు ఫలించలేక పోయాయి. మేఖళాలు, కలశానికి శనివారం ఉదయం కళాన్యాసం జరగాల్సి ఉండగా సాయంత్రం 5గంటల దాకా కూడా ధ్వజస్థంభంపై బిగించలేకపోయారు. కళాన్యాసం చేసేందుకు పండితులు అన్నీ సిద్ధం చేసుకుని హోమాలు కూడా ముగించారు. అయినప్పటికీ మేఖలాలు, కలశం బిగించక పోవడంతో మధ్యాహ్నం 1గంట దాకా ఎదురుచూసిన అర్చకులు వెళ్లిపో యారు. ఈనెల 24న జీవ ధ్వజానికి కళాన్యాసం ఉంటుందని ధర్మకర్తలంతా రావాలంటూ పాలకమండలికి సమాచారం ఇచ్చి తీరా కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంమైంది. ఎట్టకేలకు ఆదివారం ఉదయానికి కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో భక్తులు అవాక్కయ్యారు. ఈ విషయమై ఆలయ ఈవో పేమ్కుమార్ను వివరణ కోరగా ఆలస్యం జరిగిన మాట వాస్తవమే అన్నారు. చేసే పని పకడ్బందీగా చేయాలనే సంకల్పంతో కొంత ఆలస్యం అయిందన్నారు.