ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటం చేయాలి
ABN , First Publish Date - 2022-05-25T06:18:39+05:30 IST
పాలకులు సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు రాజీ లేని పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ.సత్యనారాయణమూర్తి అన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ.సత్యనారాయణమూర్తి
పాడేరు, మే 24(ఆంధ్రజ్యోతి): పాలకులు సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు రాజీ లేని పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ.సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం ఇక్కడికి వచ్చిన ఆయన తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు డి.భీమలమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన పల్లెలకు తాగు, సాగు నీటిని అందించాలని, సీజనల్ వ్యాధులను అదుపు చేసేందుకు ముందస్తుగానే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. అలాగే సామాన్యుల జీవనానికి భారంగా ఉన్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలన్నారు.
30న కలెక్టరేట్ వద్ద ధర్నా
ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 30న వామపక్షాలు తలపెట్టిన కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని సత్యనారాయణమూర్తి అన్నారు. అలాగే చింతపల్లిలో జూలై 12న సీపీఐ జిల్లా మహాసభల నిర్వహణకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. అలాగే అంతకుముందే మండల మహాసభలను నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ అల్లూరి జిల్లా కన్వీనర్ పొట్టిక సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా రాధాకృష్ణ, పి.పోతురాజు, జె.రాజుబాబు, అమర్, ఎం.రాజుబాబు, ఎం.నాగరాజు, సింహాచలం, సింహాద్రి, సత్తిబాబు, కొండలరావు, సత్యనారాయణ, నాయుడు పాల్గొన్నారు.