నదులకు వరద
ABN , First Publish Date - 2022-08-10T05:09:53+05:30 IST
ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో నదులకు వరదనీరు పోటెత్తుతోంది. వంశధార, నాగావళి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఉప్పొంగి ప్రవహిస్తున్న వంశధార, నాగావళి
భామిని/గురుగుబిల్లి/పాచిపెంట : ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో నదులకు వరదనీరు పోటెత్తుతోంది. వంశధార, నాగావళి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ తీర ప్రాంతవాసులను అధికారులు అప్రమత్తం చేశారు. భామిని మండలంలోని వంశధార నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. కాట్రగడ వద్ద మంగళవారం మధ్యాహ్నానికి నదిలో 32 వేల క్యూసెక్కులు ప్రవహించింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి హిరమండలం జలాశయానికి ఐదు వేల క్యూసెక్కుల నీరు తరలించినట్లు ప్రాజెక్టు డీఈ భవానీ శంకర్ తెలిపారు. ఇదిలా ఉండగా నది ఉధృతి వల్ల బిల్లుమడ, సింగిడి, పసుకుడి తదితర గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న, వరి పొలాల్లో నీరు చేరింది. నీరు ఎక్కువ రోజులు పొలాల్లో ఉంటే పంటలు పాడవుతాయని రైతులు వాపోతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ అప్పారావు, ఆర్ఐ రాంబాబు, వీఆర్వో శంకరరావు లివిరి, సింగిడి నదీతీర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్థులతో మాట్లాడారు. వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలోకి 5600 క్యూసెక్కులకు పైగా నీరు చేరింది. అధికారులు అప్రమత్తమై స్పిల్వే గేట్లు నుంచి దిగువకు 4 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల నుంచి 1520 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసినట్లు ప్రాజెక్టు డీఈ బి.శ్రీహరి, జేఈ కె.శ్రీనివాసరావు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతవాసులకు తహసీల్దార్ అజూ రఫీజాన్ హెచ్చరికలు జారీ చేశారు. నదీ ప్రాంతంలో ఎవరూ చేపల వేటకు వెళ్లరాదన్నారు. పాచిపెంటలోని పెద్దగెడ్డ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 213.8 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 213.3 మీటర్లుగా ఉంది. వరదనీరు పెరిగితే స్పిల్వే ద్వారా నదిలోకి నీరు విడిచిపెడతామని పెద్దగెడ్డ డీఈ కనకారావు చెప్పారు.
వెంగళరాయ సాగర్ కాలువకు మళ్లీ గండి
సీతానగరం: అంటిపేట సమీపంలో వెంగళరాయ సాగర్ కాలువకు మళ్లీ గండి పడింది. రైతులు వరి నాట్లు వేసిన వారం అయింది. కాలువకు గండి పడడంతో 100 ఎకరాల్లో ఊబాలు మీదుగా నీరు ప్రవహించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల క్రితం ఇదే ప్రదేశంలో గండి పడింది. ఇరిగేషన్ అధికారులు మట్టి, ఇసుక బస్తాలు వేసి గండిని పూడ్చి వేశారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మళ్లీ అదేచోట గండిపడడంతో సాగునీరు పంట పొలాల మీదుగా ప్రవహించి వరికి నష్టం వాటిల్లింది. వరినాట్లు వేసిన కొద్ది రోజులకే అవి ముంపునకు గురి కావడంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.