వ్యర్థాల శుద్ధికి ఆన్లైన్ ప్లాట్ఫామ్
ABN , First Publish Date - 2020-06-06T09:45:52+05:30 IST
దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫాంను రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(ఏపీఈఎంసీ)ను సీఎం జగన్ ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం
- దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు
అమరావతి, జూన్5(ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫాంను రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(ఏపీఈఎంసీ)ను సీఎం జగన్ ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో దీనిని సీఎం లాంఛనంగా ఆవిష్కరించారు. పారిశ్రామిక సంస్థలు తమవద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్లైన్లో నమోదు చేస్తే, వాటిని తీసుకెళ్లి, కాలుష్య రహితంగా శుద్ధిచేసే విధానాన్ని రూపొందించారు. కాలుష్య కారక వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే ట్రీట్మెంట్ వ్యవస్థలు లేని పరిశ్రమలు ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించే సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. ఇలా పరిశ్రమలు, వ్యర్థాల నిర్వహణ సంస్థలను ఆన్లైన్ వేదికగా కలిపేందుకు ఏపీఈఎంసీ సంధానకర్తగా వ్యవహరించనున్నది. ఇందుకోసం ఏపీఈఎంసీకి పరిశ్రమలు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గౌతంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.