కన్నపేగుకు ఉరేసిన వివాహేతర సంబంధం

ABN , First Publish Date - 2022-08-05T10:15:04+05:30 IST

భర్త సోదరునితో పెట్టుకున్న వివాహేతర సంబంధానికి దూరమవ్వడం ఇష్టంలేని ఓ మహిళ..

కన్నపేగుకు ఉరేసిన వివాహేతర సంబంధం

  • వదిన, మరిది మధ్య శారీరక బంధమే కారణం 
  • రెండేళ్ల కూతురిని చంపి.. ఆపై అతనితో కలిసి బలవన్మరణం 

పటాన్‌చెరు రూరల్‌, ఆగస్టు 4: భర్త సోదరునితో పెట్టుకున్న వివాహేతర సంబంధానికి దూరమవ్వడం ఇష్టంలేని ఓ మహిళ.. ప్రియునితో కలిసి చావుకు సిద్ధమైంది. రెండేళ్ల వయస్సున్న తన కన్నకూతురిని ముందుగా కడతేర్చి.. ఆపై, మరిదితో కలిసి ఉరి వేసుకుని బలవన్మరణం పొందింది. వివాహేత సంబంధానికి మూడు ప్రాణాలు బలైన ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం బానూరు గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని సిమ్రూద్‌ హయ్యర్‌ గ్రామానికి చెందిన గజేంద్ర కుసుబ.. పటాన్‌చెరు మండలంలోని ఓ ప్రైవేటు సంస్థలో కార్మికునిగా పని చేస్తున్నారు. భార్య రేఖ(28) కూతురు సోనమ్‌(2)తో కలిసి బానూరులో నివాసముంటున్నారు. అయితే, గజేంద్ర సోదరుడు బసుదేవ కుసుబ(27) బానూరులోని సోదరుని ఇంటి పక్కనే నివాసముంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనికి చేరాడు. స్వగ్రామంలో ఉన్నప్పుడే బసుదేవ, రేఖ మధ్య వివాహేతర సంబంధం ఉండగా, విషయం పెద్ద మనుషులు దాకా వెళ్లింది. అనంతరం బసుదేవ నందిగామ వచ్చిన తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగించారు. బుధవారం రాత్రి బసుదేవ, రేఖ(రేఖ ఇంట్లో) కలిసి ఉండగా గజేంద్ర వారిని చూశాడు. అనంతరం ఏం జరిగిందో తెలియదు కానీ కూతురు సోనమ్‌కు చీరతో ఉరి వేసిన రేఖ, ఆపై బసుదేవతో కలిసి అదే చీరకు ఉరి వేసుకుని కనిపించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, గజేంద్ర పక్క గదిలో ఉండగానే ఈ దారుణం జరిగింది.

Updated Date - 2022-08-05T10:15:04+05:30 IST