రాజ్యాంగాన్ని అవమానించారంటూ వ్యాపారి ఇంటి ముట్టడికి యత్నం
ABN , First Publish Date - 2021-11-29T05:08:20+05:30 IST
రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేడ్కర్, రాజ్యాంగాన్ని అవమానిస్తూ, సోషల్ మీడియాలో ఒక వ్యాపారి పోస్టులు చేయడం రెండురోజులుగా దుబ్బాకలో వివాదానికి దారితీసింది.
దుబ్బాకలో ఉద్రిక్తత, దళిత సంఘాల నేతల అరెస్ట్
భారీగా మోహరించిన పోలీసులు
దుబ్బాక, నవంబరు 28 : రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేడ్కర్, రాజ్యాంగాన్ని అవమానిస్తూ, సోషల్ మీడియాలో ఒక వ్యాపారి పోస్టులు చేయడం రెండురోజులుగా దుబ్బాకలో వివాదానికి దారితీసింది. ఆదివారం దుబ్బాకకు చెందిన వ్యాపారి నల్ల శ్రీనివాస్ ఇంటి ముట్టడి కార్యక్రమానికి దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో దుబ్బాక పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. దుబ్బాక అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వ్యాపారి నల్ల శ్రీనివాస్ ఇంటి ముట్టడికి సన్నద్ధమైన దళిత సంఘాల నేతలను పోలీసులు కట్టడి చేశారు. దీంతో పోలీసులకు, దళిత సంఘాల నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ర్యాలీ రూట్ మ్యాప్ను మార్చాలంటూ పోలీసులు సూచించారు. చివరికి స్థానిక శాస్ర్తీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం, పోలీ్సస్టేషన్ నుంచి ర్యాలీ వెళ్లేందుకు పోలీసులు అంగీకరించారు. ఈ క్రమంలో దళిత సంఘాల నేతలు ర్యాలీగా వచ్చి వ్యాపారి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అరెస్ట్ చేసి వాహనాల్లో మిరుదొడ్డికి తరలించారు. అంతేకాకుండా వ్యాపారి నల్ల శ్రీనివాస్ ఇంటి వద్ద భారీ బందోబస్తును నిర్వహించారు. ఈ ర్యాలీలో దళిత సంఘాల నాయకులు ఆస స్వామి, ర్యాకం శ్రీరాంలు, ఇల్లెందుల శ్రీనివాస్, కాల్వ లింగం, చెక్కపల్లి పద్మయ్య, కట్కూరి రాంచంద్రం, దొమ్మాట భూపాల్, రాజమల్లు, ఆస రాజశేఖర్ పాల్గొన్నారు.
అరెస్ట్ పట్ల వివిధ పార్టీల ఖండన
శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన దళిత సంఘాల నేతలను అరెస్ట్ చేయడం అన్యాయమని పలు పార్టీల నాయకులు ఖండించారు. రాజ్యాంగాన్ని అవమానపరిచిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తున్న దళిత సంఘాలను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని టీఆర్ఎస్ దుబ్బాక పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణాగౌడ్, బీఎస్పీ నాయకుడు పర్స రవి, కాంగ్రెస్ నాయకులు శ్రీరాం, నరేందర్ ఖండించారు.