‘స్వచ్ఛ’ పోటీని పెంచేందుకు అమృతోత్సవ్
ABN , First Publish Date - 2021-07-28T04:28:25+05:30 IST
: పల్లెల్లో స్వచ్ఛతపై పోటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను ప్రతిబింబించే లఘుచిత్రాల రూపకల్పనను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛ ఫిల్మోంకి అమృత్ మహోత్సవ్’
కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమం
స్వచ్ఛతపై గ్రామాలవారీగా లఘుచిత్రాలు
మెదక్ రూరల్, జూలై 27: పల్లెల్లో స్వచ్ఛతపై పోటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను ప్రతిబింబించే లఘుచిత్రాల రూపకల్పనను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛ ఫిల్మోంకి అమృత్ మహోత్సవ్’ పేరిట పోటీలను నిర్వహిస్తున్నది. ఇందులో పాల్గొనే పంచాయతీలు తడి, పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్, ద్రవవ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం తదితర అంశాలపై లఘుచిత్రాన్ని రూపొందించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా వచ్చిన లఘుచిత్రాలను పరిశీలించి ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేస్తారు. ప్రఽథమ బహుమతిగా రూ. 1.60 లక్షలు, మొదటి రన్నరప్కు రూ. 60 వేలు, రెండో రన్నర్పకు రూ. 30 వేలు నగదు బహుమతి అందించనుంది.
పోటీకి మార్గదర్శకాలు..
మెదక్ జిల్లావ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలు స్వచ్ఛ ఫిల్మోంకి అమృత్ మహోత్సవ్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే సర్పంచ్లకు లఘు చిత్రాల తయారీపై స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్బీఎం) ప్రతినిధులు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త సేకరణ, వర్మీకంపోస్టు తయారీ, వ్యక్తిగత పరిశుభ్రత, బహిరంగ మలవిసర్జన నిర్మూలన, మురికినీటి నిర్వహణ, వంద శాతం ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్యంపై ప్రజల అవగాహనతో పాటు గ్రామాభివృద్ధి అంశాలపై లఘుచిత్రాన్ని రూపొందించాల్సి ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వాయు్సఓవర్, పాటలు, మ్యూజిక్తో నిడివి 5 నిమిషాలు ఉండేలా ఎడిటింగ్ పూర్తిచేయాలి. సిద్ధమైన లఘు చిత్రాన్ని జిల్లా కోఆర్డినేటర్లను సంప్రదించి ఆగస్టు 15లోగా యాప్లో ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది.