అమరావతిపై చర్చ జరగాల్సిందే
ABN , First Publish Date - 2020-12-05T09:24:47+05:30 IST
‘‘అమరావతిని చంపేస్తాం.. రైతులపై కేసులు పెడతాం’’ అంటే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ హెచ్చరించింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేసింది.
శాసనమండలిలో టీడీపీ సభ్యుల నిరసన
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతిని చంపేస్తాం.. రైతులపై కేసులు పెడతాం’’ అంటే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ హెచ్చరించింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేసింది. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దీపక్రెడ్డి, జగదీశ్ శుక్రవారం వాయిదా తీర్మానం ఇవ్వగా వేరే ఫోరంలో రావాలంటూ చైర్మన్ ఎంఏ షరీఫ్ తిరస్కరించారు. టీడీపీ మండలి పక్షనేత యనమల రామకృష్ణుడు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ రంగంలోకి దిగి అమరావతిపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు. యనమల మాట్లాడుతూ అమరావతి రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తున్నారని, చాలా ముఖ్యమైన ఈ అంశపై అవసరమైతే సభలో ఓటింగ్ చేపట్టి మెజార్టీ అభిప్రాయం తీసుకుని అయినా చర్చ జరగాల్సిందేనన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ లక్షలాది మంది రైతులు ఢిల్లీని ముట్టడించారని, అమరావతి రైతులకు అన్యాయం జరిగితే ఇక్కడా అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ అశోక్బాబు తదితరులు ఈ అంశంపై మాట్లాడారు.