రాజధాని ఎక్కడో చెప్పుకోలేకుండా చేశారు!
ABN , First Publish Date - 2022-01-24T08:54:05+05:30 IST
అమరావతిని నిర్వీర్యం చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అని, అందరూ ఎగతాళి చేసే స్థితికి సీఎం జగన్రెడ్డి తీసుకొచ్చారని రాజధానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు.
767వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు
తుళ్లూరు, జనవరి 23: అమరావతిని నిర్వీర్యం చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అని, అందరూ ఎగతాళి చేసే స్థితికి సీఎం జగన్రెడ్డి తీసుకొచ్చారని రాజధానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారం నాటికి 767వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ.. దాదాపు పది వేల కోట్ల ప్రజాధనంతో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు జరిగాయన్నారు. ఆ నిర్మాణాలను గాలికొదిలేసి, ప్రజా ధనానికి విలువ లేకుండా చేసిన పాలకులు గద్దె దిగి పోవాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన అమరావతి రైతులపై కక్షతో తీసుకున్న నిర్ణయమన్నారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు జగన్ రెడ్డి చెప్పిన మాటలు బూటకమని ప్రజలకు అర్థమైందన్నారు.