Amravati: ఎన్ఐఏ కస్టడీలో కెమిస్ట్ హత్య కేసు నిందితులు

ABN , First Publish Date - 2022-07-05T21:26:02+05:30 IST

సంచలనం సృష్టించిన అమ్రావతి కెమిస్ట్ ఉమేష్ కొల్హే హత్య కేసు నిందితులు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ ..

Amravati: ఎన్ఐఏ కస్టడీలో కెమిస్ట్ హత్య కేసు నిందితులు

అమ్రావతి: సంచలనం సృష్టించిన అమ్రావతి కెమిస్ట్ ఉమేష్ కొల్హే హత్య కేసు నిందితులు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసు అధికారులు మంగళవారంనాడు తెలిపారు. అమ్రావతి కోర్టు ముందు వీరిని ఎన్ఐఏ హాజరు పరిచింది. నాలుగు రోజుల ట్రాన్సిస్ రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది.


మహారాష్ట్రలోని అమ్రావతిలో జూన్ 21వ తేదీ రాత్రి 10-10.30 గంటల మధ్యలో ముగ్గురు వ్యక్తులు ఉమేష్‌పై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఉమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ దారుణ హత్యకు వారం రోజుల ముందు అమ్రావతి కెమిస్ట్ హత్యా ఘటన చోటుచేసుకుంది. కాగా, అమ్రావతి సిటీ కొత్వాల్ పోలీసుల కథనం ప్రకారం, అమ్రావతిలో మెడికల్ దుకాణాన్ని ఉమేష్ నడుపుతున్నాడు. నూపుర్ శర్మ హత్యకు మద్దతుగా ఒక పోస్ట్‌ను ఆయన వాట్సా్ప్ గ్రూపులలో షేర్ చేశారు. ఆ పోస్టును తన కస్టమర్లకు షేర్ చేస్తూ, పొరపాటున కొందరు ముస్లింలు సభ్యులుగా ఉన్న గ్రూప్‌కు కూడా పోస్ట్ చేశారు. ఈ కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కాగా, ఈ హత్య కేసులో పట్టుబడిన ఏడుగురు నిందితులను ఈనెల 8వ తేదీలోగా ముంబై కోర్టులో ఎన్ఐఏ హాజరుపరచే అవకాశాలున్నాయి. అరెస్టయిన వారిలో ముదసర్ అహ్మద్ (22), షారూక్ పథాన్ (25), అబ్దుల్ తౌఫిక్ (24), షోయబ్ ఖాన్ (22), అతిబ్ రషీద్ (22), యూసుఫ్ ఖాన్ (32)తో పాటు హత్యకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న షేఖ్ ఇర్ఫాన్ షేఖ్ రహీమ్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-07-05T21:26:02+05:30 IST