మా త్యాగాలను మరవొద్దు
ABN , First Publish Date - 2020-07-13T11:19:13+05:30 IST
మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని రాజధాని రైతులు, దళిత జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
208వ రోజుకు చేరిన అమరావతి ఆందోళనలు
తుళ్లూరు/తాడికొండ, జూలై 12 : మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని రాజధాని రైతులు, దళిత జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం ఆదివారం 208వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని ప్రాంతవాసుల త్యాగాలను గుర్తించాలన్నారు. అంబేడ్కర్ స్మృతివనాన్ని రాజధానిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత నేతలు నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులను పక్కనపెట్టి కక్షసాధింపుతో వైసీపీ పాలన చేస్తోందని రైతులు, మహిళలు ఆరోపించారు. ఇప్పటికైనా మూడు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకుని అమరావతి నుంచి పాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు.