హైదరాబాద్ గుండెలపైకి అమ్మోనియం నైట్రేట్
ABN , First Publish Date - 2020-08-10T07:29:52+05:30 IST
చెన్నై శివారు ప్రాంతమైన మనలి వద్ద కంటైనర్లలో ఐదేళ్ల నుంచి నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్..హైదరబాద్కు చేరుకుంటోంది...
- కొనుగోలు చేసిన ఒక సంస్థ
- చెన్నై నుంచి పది కంటైనర్లలో తరలింపు
చెన్నై, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): చెన్నై శివారు ప్రాంతమైన మనలి వద్ద కంటైనర్లలో ఐదేళ్ల నుంచి నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్..హైదరబాద్కు చేరుకుంటోంది. ఒక సంస్థ కొనుగోలు చేయడంతో చెన్నై నుంచి మొదటి కంటైనర్తో ఒక లారీ ఆదివారం బయలుదేరింది.
ఐదేళ్ళ క్రితం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ను మనలిలో ఉన్న టెర్మినల్ వద్ద 37 కంటైనర్లలో నిల్వ ఉంచారు. ఇది మొత్తం 740 టన్నులని కస్టమ్స్ అధికారులు అప్పట్లో ధ్రువీకరించారు. అయితే, చెన్నైలో సంభవించిన వరదల్లో 50టన్నుల మేర అమ్మోనియం నైట్రేట్ గాలిలో, నీటిలో కలిపోయిందని అధికారుల తెలిపారు. దీంతో ప్రస్తుతం 690టన్నులు ఉందని చెప్పారు. ఇటీవల లెబనాన్లోని బీరుట్ ఓడరేవులో అమ్మోనియం నైట్రేట్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వందల మంది మృతి చెందగా.. వేల మంది గాయపడ్డారు. ఆ తర్వాత పీఎంకే అధ్యక్షుడు రాందాస్ డిమాండ్తో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. టెర్మినల్ వద్ద ఉన్న అమ్మోనియం నైట్రేట్ కంటైనర్లను కస్టమ్స్, అగ్నిమాపక, పర్యావరణ అధికారులు కొద్ది రోజుల క్రితం పరిశీలించారు. ఈ నేపథ్యంలో అక్కడి అమ్మోనియం నైట్రేట్ను హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసింది. ఆదివారం సాయంత్రం అమ్మోనియం నైట్రేట్ నిల్వలున్న మూడు కంటైనర్లను మనలి నుంచి హైదరాబాద్కు రవాణా చేస్తున్నారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల నడుమ తరలిస్తున్నామని, మూడు రోజుల్లో పది కంటైనర్లను రవాణా పూర్తవుతుందని స్థానిక అధికారులు తెలిపారు.