పేద విద్యార్థులకు వరం అమ్మఒడి
ABN , First Publish Date - 2022-06-28T05:43:17+05:30 IST
పేదల విద్యాభివృద్ధికి అమ్మఒడి పథకం ఒక వరమని కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు.
ఒంగోలు (విద్య), జూన్ 27 : పేదల విద్యాభివృద్ధికి అమ్మఒడి పథకం ఒక వరమని కలెక్టర్ దినేష్కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్ కళాపరిషత్లో సోమవారం ఏర్పాటుచేసిన అమ్మఒడి మూడో విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యాశాఖలో వచ్చిన పెనుమార్పుల్లో ఒకటి మధ్యాహ్న భోజనం కాగా రెండవది అమ్మఒడి, మనబడి నాడు-నేడు అని అన్నారు. అమ్మఒడి మూడో విడత కింద జిల్లాలో 2,09,776మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు సీఎం బటన్ నొక్కి రూ.314.66 కోట్లు జమచేశారని తెలిపారు. అనంతరం అమ్మఒడి నమూనా చెక్కులను అందజేశారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, మేయర్ గంగాడ సుజాత, డీఈవో విజయభాస్కర్, ఆర్ఐవో సైమన్విక్టర్, డీవీఈవో వీవీ సుబ్బారావు, ఏపీసీ శ్రీనివాసరావు, ఒంగోలు ఉప విద్యాధికారి అనితారోజ్రాణి పాల్గొన్నారు.