జగన్మాతా.. నమో నమః

ABN , First Publish Date - 2022-09-29T05:24:32+05:30 IST

దేవీ నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు బుధవారం పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేకపూజలు చేశారు.

జగన్మాతా.. నమో నమః

హిందూపురం, సెప్టెంబరు 28: దేవీ నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు బుధవారం పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేకపూజలు చేశారు. కన్యకాపరమేశ్వరీ ఆలయంలో రేణుకాదేవి అలంకరణ శ్రీవాసవీమాతగా దర్శనమిచ్చారు. ముద్దిరెడ్డిపల్లిలో చౌడేశ్వరీదేవి రాజరజేశ్వరి అలంకణలో భక్తులకు దర్శనమివ్వగా, విజయనగర్‌లోని చౌడేశ్వరీదేవి సరస్వతి మాతగా, జలదుర్గమ్మ అన్నపూర్ణేశ్వరిదేవి రూపంలో అక్షింతల అలంకారంతో దర్శనమిచ్చారు. శాకాంబరిదేవిగా యల్లమ్మదేవి దర్శనమిచ్చింది. మిగిలిన అమ్మవారి ఆలయాల్లో కూడా భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. 

లేపాక్షి: దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా బుధవారం మూడోరోజు అమ్మవారు గాయత్రిదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, విశేష పూజలను అమ్మవారి ఆలయాల్లో నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. 


నేడు లలితాదేవి అలంకరణ 

దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో దసరా వేడుకల సందర్భంగా నాలుగోరోజు గురువారం  అమ్మవారు  లలితాదేవి అలంకరణలో దర్శనమివ్వనున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. 

గోరంట్ల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు బుధవారం గోరంట్ల పట్టణంలోని శ్రీవాసవీ మాతను కన్యాకుమారిగా అలంకరించారు. చౌడేశ్వరీ ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు. గుమ్మయ్యగారిపల్లి మారెమ్మ ఆలయంలో శాకాంబరి దేవి అలంకరణ చేసి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు.

పరిగి: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పరిగి కాళికా అమ్మవారి ఆలయంలో మూడోరోజు బుధవారం దాలంబరి అలంకరణ చేశారు. వేద పండితుల నడుమ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. 

పెనుకొండ: దసరా ఉత్సవాలలో బుధవారం స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారిని డ్రైఫ్రూట్‌ అలంకరణలో, శ్రీలక్ష్మీ వెంకటరమణస్వామిని కూర్మావతార రూపంలో అలంకరించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. 

మడకశిరటౌన: శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ అమ్మవారిని డ్రైఫ్రూట్స్‌తో అలంకరణ చేశారు. కొల్లాపురమ్మ, గంగాభవానీ, ఊరిమారమ్మ, పలుదేవాలయాల్లో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. 

అమరాపురం: మండల కేంద్రంలో వెలసిన కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి తమలపాకుల అలంకరణ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

రొళ్ల: మండలంలోని రత్నగిరి కొల్లాపురమ్మ, మల్లినమడుగు లక్ష్మీదేవి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.


Updated Date - 2022-09-29T05:24:32+05:30 IST