రాత్రంతా పుల్వామా క్యాంపులో గడిపిన అమిత్‌షా

ABN , First Publish Date - 2021-10-26T16:41:47+05:30 IST

ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం మోదీ ప్రభుత్వం ఉపేక్షించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి చాలా వరకూ మెరుగైందని, పూర్తి శాంతి నెలకొనేంతవరకూ తాము..

రాత్రంతా పుల్వామా క్యాంపులో గడిపిన అమిత్‌షా

శ్రీనగర్: ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం మోదీ ప్రభుత్వం ఉపేక్షించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి చాలా వరకూ మెరుగైందని, పూర్తి శాంతి నెలకొనేంతవరకూ తాము సంతృప్తి చెందేది లేదని పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పుల్వామాలోని లెథ్‌పోర సీఆర్‌పీఎఫ్ క్యాంపులో సోమవారం రాత్రంతా ఆయన గడిపారు. జవాన్లతో మమేకమవుతూ, వారిలో ఉత్సాహాన్ని నింపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇదే శిబిరం వద్ద 2019 ఫిబ్రవరిలో ఆత్మాహుతి కారు బాంబు దాడికి పాల్పడిన ఘటనలో 40 మంది పారామిలటరీ సిబ్బంది అశువులు బాసారు.


''మీతో ఒక రాత్రంతా ఉండి, మీ సమస్యలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను'' అని షా ఈ సందర్భంగా జవాన్లతో ముచ్చటిస్తూ పేర్కొన్నారు. తన పర్యటనలో ఇది చాలా కీలకమని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి చాలా మటుకు మెరుగైందని, మోదీ కలలుగన్న శాంతియుత జమ్మూకశ్మీర్‌ను సాకారం చేయాలని పేర్కొన్నారు. రాళ్లు రువ్వుడు ఘటనలు చాలావరకూ తగ్గిపోయాయని, అంత మాత్రంతో మనం తృప్తిచెందరాదని సూచించారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం సహించేది లేదన్నారు. ఉగ్రవాదం మానవత్వానికి వ్యతిరేకమని, మానవత్వంపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారి నుంచి ప్రజల ప్రాణాలను కాపడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని జవాన్లకు దిశానిర్దేశం చేశారు.


జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధిపరంగా ఎన్నో మార్పులు వచ్చాయని, మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక, విద్యారంగంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని, దుష్టశక్తుల పన్నాగాలను ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ తిప్పికొడుతుండటం వల్లే ఇది సాధ్యమయిందని ప్రశంసించారు. 370 అధికరణ, 35ఎ రద్దు చేసినప్పుడు చాలా పెద్దఎత్తున రియాక్షన్ వస్తుందని చాలా భయాలు వ్యక్తమయ్యాయని, కానీ అలాంటిదేమీ జరగలేదని, ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని, రక్తపాతం చోటుచేసుకోలేదని, ఇందుకు బలగాల అప్రమత్తతే కారణమని అన్నారు. దేశ, జమ్మూకశ్మీర్ ప్రయోజనాల కోసం 28,000 జవాన్లు, జమ్ముకశ్మీర్ పోలీసులు పనిచేశారని, జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి శకం మొదలైందని చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజలు 370 అధికరణన రద్దును అంగీకరించారని, ప్రధాని అభివృద్ధి కల పూర్తిగా సాకారమైందని, పూర్తి శాంతి తప్పనిసరిగా నెలకొంటుందనే నమ్మకం ఉందని చెప్పారు. 2014లో  11వ స్థానంలో ఉన్న జమ్మూకశ్మీర్ త్వరలోనే కీలకమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అన్నారు. 2024 నాటికి మూడో స్థానంలోకి చేరుకుంటామని చెప్పారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లతో ఒక రోజు రాత్రంతా కలిసి ఉంటే అవకాశం కలగడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

Updated Date - 2021-10-26T16:41:47+05:30 IST