జీడీపీ మానవీయ కోణాన్ని ప్రజలకు మోదీ చేరువ చేశారు : అమిత్ షా
ABN , First Publish Date - 2021-12-04T23:37:15+05:30 IST
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మానవీయ కోణాన్ని
న్యూఢిల్లీ : స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మానవీయ కోణాన్ని ప్రతి ఒక్కరి ముంగిట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. జీడీపీ మానవీయ కోణంపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తలను కోరారు. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, వంట గ్యాస్; దేశవ్యాప్తంగా 10 కోట్ల మరుగుదొడ్లు సమకూర్చడం జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుందో, లేదో పరిశీలించాలన్నారు. ఇటువంటి చర్యలు జీడీపీ వృద్ధికి మాత్రమే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా దోహదపడతాయని చెప్పారు. ఆయన ఓ మీడియా సంస్థ నిర్వహించిన నాయకత్వ సదస్సులో శనివారం మాట్లాడారు.
గత ప్రభుత్వాలు పేదలకు ప్రయోజనాలను అందజేయడంలో విఫలమయ్యాయని, అందువల్ల బహుళ పార్టీల పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ, పేదరిక నిర్మూలన, గ్రామీణ విద్యుదీకరణ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. ‘‘గడచిన ఏడేళ్ళలో చేసిన అత్యంత ముఖ్యమైన పని ఏమిటంటే, భారతీయ ఆర్థిక వ్యవస్థలో 80 కోట్ల మందిని వాటాదారులను చేయడం’’ అని చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదాను కల్పిస్తామని తెలిపారు.