Jammu and Kashmir : పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-05T21:34:49+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని

Jammu and Kashmir : పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

బారాముల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir) నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. దేశంలో అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మార్చుతుందని చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 


బారాముల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, జమ్మూ-కశ్మీరులో 1990వ దశకం నుంచి ఉగ్రవాదం వల్ల 42,000 మంది ప్రాణాలు కోల్పోయారని, ఉగ్రవాదం వల్ల ఎవరైనా లబ్ధి పొందారా? అని ప్రశ్నించారు. జమ్మూ-కశ్మీరు అభివృద్ధిలో వెనుకబడటానికి మూడు కుటుంబాలే కారణమని దుయ్యబట్టారు. అబ్దుల్లాలు (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీలు (పీడీపీ), నెహ్రూ-గాంధీలు (కాంగ్రెస్) వల్ల  అభివృద్ధి చెందలేదన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని వీరే పరిపాలించారన్నారు. వీరి పాలన అవినీతిమయమని చెప్పారు.


పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని కొందరు అంటున్నారని, ఆ దేశంతో మనం ఎందుకు చర్చలు జరపాలని ప్రశ్నించారు. మనం చర్చలు జరిపేది లేదన్నారు. మనం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం అన్నారు. ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదని, దానిని తుదముట్టిస్తుందని చెప్పారు. జమ్మూ-కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది తమ లక్ష్యమని చెప్పారు. 


కొందరు తరచూ పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారని, అయితే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఎన్ని గ్రామాలకు విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని ప్రశ్నించారు. మన ప్రభుత్వం కశ్మీరులోని అన్ని గ్రామాలకు విద్యుత్తు కనెక్షన్లను ఇచ్చిందని తెలిపారు. 


అమిత్ షా మంగళవారం నుంచి కశ్మీరులో పర్యటిస్తున్నారు. గురువారం కూడా కశ్మీరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


Updated Date - 2022-10-05T21:34:49+05:30 IST