శివమొగ్గలో 7 డ్రోన్లతో నిఘా

ABN , First Publish Date - 2022-02-23T20:45:54+05:30 IST

బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య నేపథ్యంలో శాంతిభద్రతల

శివమొగ్గలో 7 డ్రోన్లతో నిఘా

బెంగళూరు : బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కర్ణాటక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఈ నెల 25 ఉదయం వరకు కర్ఫ్యూను పొడిగించింది. ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో శివమొగ్గలో ఏడు డ్రోన్లతో నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. హర్ష హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. 


హర్ష (26)ను ఫిబ్రవరి 20 రాత్రి కొందరు దుండగులు హత్య చేశారు.  ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో మహమ్మద్ కషిఫ్, సయ్యద్ నదీం, అషిఫుల్లా ఖాన్, రెహాన్ ఖాన్, నెహల్, అబ్దుల్ అఫ్నన్ ఉన్నారని తెలిపారు. 


కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర బుధవారం మాట్లాడుతూ, హర్ష హత్య నేపథ్యంలో శివమొగ్గ జిల్లాలోని రెండు పోలీస్ స్టేషన్లలో నియమితులైన పోలీసు అధికారులు, సిబ్బందిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మందికి తీవ్రమైన నేర చరిత్ర ఉందని, వారిపట్ల గత ఐదేళ్లలో ఈ రెండు పోలీస్ స్టేషన్లలో పని చేసిన అధికారులు, సిబ్బంది ఏవిధంగా వ్యవహరించారో తెలుసుకోవడం కోసం దర్యాప్తుకు ఆదేశించామన్నారు. బాధ్యతారహితంగా వ్యవహరించే పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదన్నారు. ఇది సాధారణ హత్య అని తాము భావించడం లేదన్నారు. దీని వెనుక ఉన్న శక్తులను బయటకు తీసుకొస్తామని చెప్పారు. 



Updated Date - 2022-02-23T20:45:54+05:30 IST